
భారత సైన్యం 2027 ఏప్రిల్లో ప్రారంభమయ్యే 68వ షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్) కోర్సులో చేరడానికి అర్హత కలిగిన అవివాహిత పురుష అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 350 పోస్టులను భర్తీ చేయనుంది. ఎంపికైన వారికి కోర్సు ప్రి-కమిషనింగ్ ట్రైనింగ్ అకాడమీ (PCTA) లో జరుగుతుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆగస్టు 7, 2026వ తేదీ వరకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు..
ఇండియన్ ఆర్మీ షార్ట్ సర్వీస్ కమీషన్ (టెక్) పోస్టులను సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, మెకానికల్, ఎంఐఎస్సీ ఇంజినీరింగ్ విభాగాల్లో భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత ఇంజినీరింగ్ బ్రాంచ్లో బీఈ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి. చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే నిర్ణీత తేదీలోపు తప్పనిసరిగా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. కేవలం నోటిఫికేషన్లో పేర్కొన్న ఇంజినీరింగ్ బ్రాంచుల్లో మాత్రమే పోస్టులను భర్తీ చేస్తారు. అభ్యర్ధుల వయోపరిమితి ఏప్రిల్ 1, 2027 నాటికి 20 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. అంటే అభ్యర్ధులు తప్పనిసరిగా 1 ఏప్రిల్ 2000 నుంచి 1 ఏప్రిల్ 2007 మధ్య జన్మించిన వారై ఉండాలి.
అలాగే నోటిఫికేషన్లో సూచించిన విధంగా శారీరక ప్రమాణాలు కూడా ఉండాలి. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్లైన్ విధానంలో ఆగస్ట్ 7, 2026వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే దరఖాస్తుల షార్ట్లిస్టింగ్, గ్రాడ్యుయేషన్ మార్కులు, ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.56,100 నుంచి రూ.1,77,500 వరకు జీతంగా చెల్లిస్తారు. ట్రైనింగ్ సమయంలో నెలకు రూ.56,100 చొప్పున స్టైపెండ్ చెల్లిస్తారు.