
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఇండియా పోస్ట్ భారీ శుభవార్త అందించింది. తపాలా శాఖ ఆధ్వర్యంలోని గ్రామీణ డాక్ సేవక్ (GDS) రిక్రూట్మెంట్ 2026 కోసం వన్టైమ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇవాళ్టి (ఆగస్టు 31) నుంచి ప్రారంభించింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా దేశవ్యాప్తంగా మొత్తం 23,757 GDS పోస్టులను భర్తీ చేయనుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనూ భారీగా పోస్టులు ఉన్నాయి. ఇందులో బ్రాంచ్ పోస్ట్మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్మాస్టర్ (ABPM), డాక్ సేవక్ పోస్టులు ఉన్నాయి. ఇండియా పోస్ట్ అధికారిక GDS పోర్టల్లో వన్టైమ్ రిజిస్ట్రేషన్ సెప్టెంబర్ 19, 2026 సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. ఆన్లైన్ దరఖాస్తుల సమర్పణ, ఫీజు చెల్లింపు ప్రక్రియ సెప్టెంబర్ 2 నుంచి మొదలవుతుంది.
ఇండియా పోస్టు జీడీఎస్ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
GDS పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. పదో తరగతిలో మ్యాథ్స్, ఇంగ్లిష్లో పాస్ మార్కులు ఉండాలి. అలాగే దరఖాస్తు చేస్తున్న పోస్టుకు సంబంధించిన స్థానిక భాషను కనీసం 10వ తరగతి వరకు చదివి ఉండాలి. అలాగే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీలకు నిబంధనల ప్రకారం గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBCలకు 3 సంవత్సరాలు, PwBD అభ్యర్థులకు 10 సంవత్సరాల వరకు వయో సడలింపు ఉంది. ఈ అర్హతలు కలిగిన వారు ఎవరైనా ఆన్లైన్ దరఖాస్తులు సెప్టెంబర్ 21, 2026 సాయంత్రం 5 గంటల వరకు సమర్పించవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్ అభ్యర్థులు రూ.100 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. అయితే మహిళలు, SC/ST, PwBD, ట్రాన్స్వుమెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. ఫీజును ఆన్లైన్లో క్రెడిట్/డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ లేదా UPI ద్వారా చెల్లించవచ్చు.
దరఖాస్తుల్లో తప్పులు సరిచేసుకునేందుకు సెప్టెంబర్ 23, 24 తేదీల్లో ఎడిట్/కరెక్షన్ విండో అందుబాటులో ఉంటుంది. GDS ఉద్యోగాలకు రెగ్యులర్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో వేతనం కాకుండా Time Related Continuity Allowance (TRCA) చెల్లిస్తారు. ఇందులో BPM పోస్టులకు నెలకు రూ.12,000 నుంచి రూ.29,380 వరకు, ABPM/Dak Sevak పోస్టులకు రూ.10,000 నుంచి రూ.24,470 వరకు చెల్లిస్తారు. TRCA నిబంధనల ప్రకారం ఇతర అలవెన్సులు, సామాజిక భద్రతా ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఈ రిక్రూట్మెంట్లో ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఎలాంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఉండదు. కేవలం పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా సిస్టమ్ జనరేటెడ్ మెరిట్ లిస్ట్ను రూపొందించి అభ్యర్థులను షార్ట్లిస్ట్ చేస్తారు. మార్కులను 4 డెసిమల్ పాయింట్ల వరకు పరిగణనలోకి తీసుకుంటారు.
ఇండియా పోస్టు జీడీఎస్ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.