
కరోనా కారణంగా విద్యార్థులపై పెరిగిన ఒత్తిడిని తగ్గించే క్రమంలో తెలంగాణ పాఠశాల విద్యాశాఖ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

గతంలోలా 11 పరీక్షలు కాకుండా వచ్చే ఏడాది జరగబోయే పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో కేవలం 6 పరీక్షా పత్రాలు మాత్రమే ఉండనున్నాయి.

అంతేకాకుండా విద్యార్థుల వెసులుబాటు కోసం 1 నుంచి 10 తరగతుల పరీక్షలకు గతేడాది మాదిరిగానే 70 శాతం సిలబస్ ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.

ఇక ఇప్పటి వరకు ఒక్కో పరీక్షా సమయం 2.45 గంటలు ఉండేది. దీనికి కారణం ఒక్కో పరీక్షకు రెండు ప్రశ్నాపత్రాలు ఉండేవి. కానీ ఇప్పుడు ఒకే ప్రశ్నాపత్రం ఉండడం, 80 మార్కులకు నిర్వహిస్తుండడంతో పరీక్ష సమయాన్ని 3.15 గంటలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

మిగిలిన 20 మార్కులను ఇంటర్నల్ మార్కుల ఆధారంగా కలుపుతారు. అయితే గతంలో నాలుగు ఇంటర్నల్ పరీక్ష (ఎఫ్ఏ)లను నిర్వహిస్తుండగా.. ఇప్పుడు ఆ సంఖ్యను రెండుకు తగ్గించారు. ఈ రెండింటిలో వచ్చిన సగటు మార్కులకు, 80 మార్కుల ప్రశ్నాపత్రంలో వచ్చిన మార్కులను కలుపుతారు.

గతేడాది వరకు భౌతికశాస్త్రానికి, జీవ శాస్త్రానికి వేర్వేరుగా పరీక్షలు జరిపేవారు కానీ ఈసారి ఒకే పరీక్షగా నిర్వహిస్తారు. అయితే రెండు ప్రశ్నా పత్రాలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నాపత్రానికి సంబంధించిన సమాధానాలను వేరు వేరు పేపర్లలో రాయాల్సి ఉంటుంది.