
హైదరాబాద్, మార్చి 15: తెలుగు రాష్ట్రాల్లో రేపట్నుంచి ఒంటి పూట బడులు ప్రారంభంకానున్నాయి. అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలల్లో మార్చి 16వ తేదీ నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. 2025-26 విద్యా సంవత్సరానికి చివరి పని దినంగా ఏప్రిల్ 23వ తేదీని నిర్ణయించడంతో ఏపీ, తెలంగాణలో ఒంటి పూట బడులు నడపనున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని స్కూళ్లు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పనిచేయనున్నాయి. ప్రభుత్వ బడుల్లో మాత్రం మధ్యాహ్నం 12.30 గంటలకు మధ్యాహ్న భోజనం అందించి.. ఆ తర్వాత పిల్లలను ఇంటికి పంపిస్తారు.
ఇదే విధంగా ప్రైవేటు పాఠశాలలు కూడా కచ్చితంగా ఒంటిపూట బడుల సమయాన్ని పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. ఎవరికీ మినహాయింపు ఉండబోదని, మధ్యాహ్నం తర్వాత స్కూళ్లు తప్పనిసరిగా మూసివేయాలని స్పష్టం చేసింది. ఏఫ్రిల్ 23 చివరి పని దినంగా ప్రకటించిన విద్యాశాఖ.. ఏఫ్రిల్ 24 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గవర్నమెంట్, ప్రైవేటు స్కూళ్లకు వేసవి సెలవులు ప్రారంభమవుతాయని తెలిపింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి జూన్ 12న తిరిగి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నట్లు విద్యా శాఖ వెల్లడించింది.
మరోవైపు ఏపీలోనూ రాష్ట్రంలో సోమవారం (మార్చి 16) నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 23వ తేదీ వరకు ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పాఠశాలలు కొనసాగనున్నాయి. విద్యార్థులకు పోషకాహారం అందించేందుకు మధ్యాహ్న భోజనాన్ని కొనసాగించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. ఏప్రిల్ 24 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటించనున్నారు. తిరిగి జూన్ 12న పాఠశాలలు తెరచుకోనున్నాయి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.