
న్యూఢిల్లీ, మార్చి 1: దేశ వ్యాప్తంగా సీబీఎస్సీ బోర్డు పరీక్షలు ఫిబ్రవరి 17వ తేదీ నుంచి మొదలైన సంగతి తెలిసిందే. పదో తరగతి పరీక్షలు మార్చి 10 వరకు, 12వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 10 వరకు కొనసాగనున్నాయి. భారత్తోపాటు విదేశాల్లోనూ ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో బోర్డు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ( CBSE ) పరీక్షల కంట్రోలర్ సన్యమ్ భారద్వాజ్ కీలక ప్రకటన చేశారు. మార్చి 7, 2026న మిడిల్ ఈస్ట్ దేశాలలో జరగాల్సిన 10వ తరగతి, 12వ తరగతి బోర్డు పరీక్షలను వాయిదా వేసినట్లు న్యూస్ ఒకటి ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ మేరకు ఆదివారం (మార్చి 1, 2026న) అధికారిక సర్క్యులర్ ద్వారా ప్రకటన విడుదల చేసినట్లు ప్రచారం అవుతుంది. ఇందులో అమెరికా – ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మధ్యప్రాచ్యంలోని కొన్ని దేశాల్లో ప్రస్తుత పరిస్థితుల కారణంగా పరీక్షలు వాయిదా పడినట్లు సదరు సర్క్యూలర్ పేర్కొంది. ప్రభావిత దేశాల్లో బహ్రెయిన్, ఇరాన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) ఉన్నాయి. ఈ సర్క్యులర్ ఈ ప్రాంతాలలోని సీబీఎస్సీ అనుబంధంగా ఉన్న పాఠశాలల్లో మార్చి 7వ తేదీన జరగనున్న పదవ తరగతి, పన్నెండో తరగతి సోషల్ సైన్స్ పరీక్షలు వాయిదా పడినట్లు పేర్కొంది. అంతేకాకుండా ఫిబ్రవరి 28 వరకు జరిగిన లాంగ్వేజ్ పరీక్షలు రద్దు అయ్యాయని కూడా ఇందులో ప్రస్తావించింది. ఈ పరీక్షలకు సంబంధించిన కొత్త తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని ఆ ప్రకటనలో ఉంది. దీంతో ఈ పరీక్షల వాయిదా వ్యవహారం కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీనిపై తాజాగా సీబీఎస్సీ బోర్డు సోషల్ మీడియా వేదికగా స్పందించింది.
దుబాయ్ సీబీఎస్సీ కార్యాలయం జారీ చేసినట్లు చక్కర్లు కొడుతున్న సదరు సర్క్యూలర్ పూర్తిగా అవాస్తవమని కొట్టివేసింది. ఇలాంటి ప్రకటన ఏదీ తాము చేయలేదని స్పష్టం చేసింది. విద్యార్దులు గందరగోళానికి గురికావొద్దని, అధికారిక వెబ్సైట్లో ఉన్న సమాచారాన్ని మాత్రమే విద్యార్ధులు పరిగణనలోకి తీసుకోవాలని చెప్పింది. దీనిపై దుబాయ్లోని CBSE ప్రాంతీయ కార్యాలయం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ డైరెక్టర్, విదేశీ CBSE పాఠశాలల అధిపతి డాక్టర్ రామ్ శంకర్ కూడా ఇప్పటికే CBSE ప్రధాన కార్యాలయానికి వివరణాత్మక నివేదికను సమర్పించారు. నకిలీ సర్క్యులర్లోని విషయాలను డాక్టర్ శంకర్ తోసిపుచ్చారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సీబీఎస్సీ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్లు, వెబ్సైట్లను మాత్రమే విశ్వసించాలని హెచ్చరించారు. స్థానిక నియంత్రణ సంస్థలు, భారత రాయబారి, కాన్సుల్ జనరల్, CBSE ఛైర్మన్లతో చురుకుగా సంప్రదింపులు జరుపుతున్నట్లు ధృవీకరించారు. పరీక్షల షెడ్యూల్లో ఎలాంటి మార్పు లేదని, షెడ్యూల్ ప్రకారం యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేసింది.
Important Alert!!
This is a fake circular. An official update will follow. pic.twitter.com/ofhLK5doUy— CBSE HQ (@cbseindia29) March 1, 2026
కాగా సీబీఎస్సీ బోర్డు పరీక్షలు ప్రస్తుతం భారతదేశం అంతటా 10వ తరగతికి 8,074 కేంద్రాలలో, 12వ తరగతికి 7,574 కేంద్రాలలో, విదేశాలలో 26 పరీక్ష కేంద్రాల్లో జరుగుతున్నాయి. మొత్తం 43 లక్షలకు పైగా విద్యార్థులు ఈ పరీక్షలు రాస్తున్నారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.