ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏడు గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎనిమిదో తరగతి, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ అర్హులైన విద్యార్ధులు నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది. ఈ ఏడు గిరిజన గురుకులాల్లో ఇంటర్ ఎంపీసీ కోర్సులో 300 సీట్లు, ఇంటర్ బైపీసీ కోర్సులో 300 సీట్ల చొప్పున ఉన్నాయి. ఇక 8వ తరగతిలో 180 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఆన్లైన్ దరఖాస్తులు ఈ రోజు (ఫిబ్రవరి 3) నుంచి ప్రారంభమవుతాయి. మార్చి 2, 2025వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన విద్యార్థులకు ఉచిత విద్య, వసతితో పాటు జాతీయ స్థాయిలో నిర్వహించే పలు ప్రవేశ పరీక్షలకు ఉచితంగా శిక్షణ కూడా ఇస్తారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు తప్పనిసరిగా ఏదైనా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2024-25 విద్యా సంవత్సరానికి ఏడో తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఎనిమిదో తరగతి ప్రవేశ పరీక్షకు అర్హులు. ఇక ఇంటర్మీడియట్లో ప్రవేశాలు పొందే విద్యార్ధులు ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి పదో తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే విద్యార్ధుల తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.లక్షకు మించకుండా ఉండాలి. 8వ తరగతి, ఇంటర్లో ప్రవేశాలు రెండింటికీ ప్రవేశ పరీక్ష ఉంటుంది.
ఎనిమిదో తరగతి ప్రవేశ పరీక్షకు 7వ తరగతి సిలబస్ నుంచి ప్రశ్నలు వస్తాయి. తెలుగులో 10 మార్కులు, ఇంగ్లిష్లో 10 మార్కులు, హిందీలో 10 మార్కులు, మ్యాథ్స్లో 10 మార్కులు, ఫిజికల్ సైన్స్లో 15 మార్కులు, బయోసైన్స్ లో 15 మార్కులు, సోషల్ స్టడీస్లో 20 మార్కుల చొప్పున మొత్తం 100 మార్కులకు పరీక్ష జరుగుతుంది. అలాగే ఇంటర్ ప్రవేశ పరీక్షకు పదో తరగతి సిలబస్ నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇంగ్లిష్లో 20 మార్కులు, మ్యాథ్స్లో 40 మార్కులు, ఫిజికల్ సైన్స్లో 20 మార్కులు, బయోసైన్స్ లో 20 మార్కుల చొప్పున మొత్తం 100 మార్కులకు పరీక్ష జరుగుతుంది.
ఏపీ గిరిజన సంక్షేమ గురుకులాల్లో అడ్మిషన్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.