
అమరావతి, జూన్ 16: ఎంబీబీఎస్, బీడీఎస్ వంటి మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ (NEET) రీ-ఎగ్జామ్ రాయనున్న విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) శుభవార్త చెప్పింది. పరీక్షా కేంద్రాలకు సులభంగా చేరుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టిన ఈ సంస్థ.. జూన్ 21న నిర్వహించనున్న నీట్ పరీక్ష సందర్భంగా విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించనున్నట్లు ప్రకటించింది. నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తమ హాల్ టికెట్ చూపిస్తే చాలు.. రాష్ట్రవ్యాప్తంగా APSRTC బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. పరీక్షా కేంద్రాలకు చేరుకోవడంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అవసరమైన చోట్ల ప్రత్యేక బస్సులను కూడా నడపనున్నారు.
ప్రతి సంవత్సరం వేలాది మంది విద్యార్థులు నీట్ పరీక్ష కోసం వివిధ పట్టణాలు, నగరాల్లోని పరీక్షా కేంద్రాలకు ప్రయాణిస్తుంటారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులపై ప్రయాణ భారం తగ్గించేందుకు APSRTC ఈ నిర్ణయం తీసుకుంది.అంతేకాకుండా పరీక్ష జరిగే రోజున ప్రధాన రూట్లలో అదనపు సర్వీసులు అందుబాటులో ఉంచి, పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు సమయానికి చేరుకునేలా ప్రత్యేక కార్యాచరణ అమలు చేయనుంది. అవసరమైతే స్థానిక పరిస్థితులకు అనుగుణంగా మరిన్ని బస్సులను కూడా ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
వైద్య విద్య లక్ష్యంగా ముందుకు సాగుతున్న విద్యార్థుల విజయయాత్రలో భాగస్వామ్యం కావడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని APSRTC పేర్కొంది. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ముందుగానే తమ ప్రయాణాన్ని ప్రణాళిక చేసుకుని, హాల్ టికెట్తో ఉచిత బస్సు సౌకర్యాన్ని వినియోగించుకోవాలని సూచించింది.