
అమరావతి, మే 15: ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికి గానూ ప్రవేశాలకు నిర్వహించిన ఏపీఆర్ఎస్ సెట్, ఏపీఆర్జేసీ, ఏపీఆర్డీసీ సెట్ పరీక్షల ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. ఫలితాలు మంత్రి నారా లోకేశ్ ఎక్స్లో ప్రకటించారు. ఈ మేరకు ఏపీ గురుకుల విద్యాలయాల సంస్థ (APREIS) ఫలితాలను వెబ్సైట్లో అందుబాటులోకి తీసుకువచ్చింది. అన్ని విభాగాల్లో 7,190 సీట్లకు 62,047 మంది విద్యార్థులు పోటీ పడ్డారు.
ఐదో తరగతిలో 3920 సీట్లకు 14,061 మంది పోటీ పడగా, 6, 7, 8 తరగతుల్లో మిగిలిన సీట్లకు ప్రవేశ పరీక్షలు నిర్వహించారు. అలాగే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 1425 సీట్లకు 41,215 మంది, డిగ్రీ మొదటి సంవత్సరంలో 220 సీట్లకు 1,018 మంది ఈ పరీక్షలు రాశారు. పరీక్ష రాసిన విద్యార్ధులు అందరికీ ర్యాంకులు ప్రకటించారు.కాగా ఏప్రిల్ 25న ఉదయం 5, 6, 7, 8 తరగతుల ప్రవేశాలకు ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ నిర్వహించగా.. మధ్యాహ్నం ఏపీఆర్జేసీ, ఏపీఆర్డీసీ 2025 ప్రవేశ పరీక్షలు నిర్వహించింది. పాఠశాలలకు ఎంపికైన విద్యార్థుల జాబితాతో పాటు జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ షెడ్యూల్ త్వరలో వెల్లడిస్తామని ఏపీఆర్ఈఐ సొసైటీ కార్యదర్శి వీఎన్ మస్తానయ్య తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ గురుకుల ప్రవేశ పరీక్షల ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఐదో తరగతిలో వజ్రపు శశికుమార్ (విజయనగరం జిల్లా), ఆరో తరగతి గొల్లంగి మౌనిక (శ్రీకాకుళం జిల్లా), ఏడో తరగతిలో కర్రా తనీశి శ్రీవర్షిణి (అనకాపల్లి జిల్లా), ఎనిమిదో తరగతి వల్లూరి రిచా (తూర్పు గోదావరి జిల్లా) మొదటి స్థానంలో నిలిచారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.