APPSC: హైకోర్టు జోక్యంతో నిలిచిపోయిన గ్రూప్ 1 ఇంటర్వ్యూలు..అయోమయం..ఏపీపీఎస్సీ పరీక్షల తీరు..!

|

Jun 18, 2021 | 8:13 PM

APPSC: ఏపీపీఎస్సీ పరీక్షల నిర్వహణ అయోమయానికి గురిచేస్తోంది. రాష్ట్రంలో నిన్నటి నుంచి నిర్వహించాల్సిన గ్రూప్‌-1 ఇంటర్వ్యూలను హైకోర్టు నిలిపేసింది.

APPSC: హైకోర్టు జోక్యంతో నిలిచిపోయిన గ్రూప్ 1 ఇంటర్వ్యూలు..అయోమయం..ఏపీపీఎస్సీ పరీక్షల తీరు..!
Appsc
Follow us on

APPSC: ఏపీపీఎస్సీ పరీక్షల నిర్వహణ అయోమయానికి గురిచేస్తోంది. రాష్ట్రంలో నిన్నటి నుంచి నిర్వహించాల్సిన గ్రూప్‌-1 ఇంటర్వ్యూలను హైకోర్టు నిలిపేసింది. పరీక్ష ప్రక్రియ ప్రారంభమయ్యాక నిబంధనలను మార్చినట్లు ప్రాథమికంగా కోర్టు అభిప్రాయపడింది. గ్రూప్‌-1 ఇంటర్వ్యూలతోపాటు తదుపరి చర్యలన్నింటినీ 4 వారాలపాటు నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది హైకోర్టు.

అసలు వివాదం ఏమిటి?

2018 డిసెంబరులో గ్రూప్‌-1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చారు. 2019 మే 26న ప్రాథమిక పరీక్ష నిర్వహించారు. అదే ఏడాది అక్టోబరులో ఫలితాలు వెల్లడించారు. వివిధ కారణాలతో ప్రధాన (మెయిన్స్‌) పరీక్షల నిర్వహణ తేదీలు ఐదు సార్లు మార్పులకు గురయ్యాయి. మొత్తమ్మీద గతేడాది 2020 డిసెంబరు 14 నుంచి 20 వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 28న ఫలితాలు ప్రకటించారు. ఇక్కడి వరకూ బాగానే ఉంది. అసలు కథ ఇక్కడే ప్రారంభం అయింది. మౌఖిక పరీక్షలకు(ఇంటర్వ్యూలకు) ఎంపిక కాలేదని పలువురు అభ్యర్ధులు ఆందోళనకు గురయ్యారు. దీంతో ఏపీలో గ్రూప్‌-1 మెయిన్స్‌ అక్రమాలు జరిగాయంటూ రాష్ట్ర హైకోర్టులో వ్యాజ్యం వేశారు 19 మంది అభ్యర్దులు. పరీక్ష ఫలితాలను రద్దు చేయాలని, ఇంటర్వూలను వాయిదా వేయాలని పిటిషన్‌. అదేవిధంగా ఈ విషయంపై సీబీఐ విచారణ చేయించాలని కోరుతూ మరికొంత మంది అభ్యర్ధులు కూడా పిటిషన్ వేశారు. అభ్యర్థులు జవాబుపత్రాల మూల్యాంకనం సక్రమంగా జరగలేదని, ఆన్‌లైన్లో మూల్యాంకనం చేసినవారి అర్హతలేంటో కూడా తమకు తెలియలేదని, అందువల్ల మార్కులు నష్టపోయామని ఏపీపీఎస్సీ దృష్టికి తీసుకెళ్లామని కోర్టుకు అభ్యర్ధులు చెప్పారు. ఒక పోస్టుకు 50 మందిని మెయిన్స్‌ పరీక్షకు పిలవాల్సి ఉండగా.. పరీక్ష ప్రక్రియ ప్రారంభం అయ్యాక ఈ నిష్పత్తిని ఏపీపీఎస్సీ కార్యదర్శి 57కు మార్చారని పిటిషన్ లో ఆరోపించారు.

కొందరు అభ్యర్థుల పరీక్ష కేంద్రాలను మార్చారని పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రధాన పరీక్ష జవాబు పత్రాలను డిజిటల్ విధానంలో మూల్యాంకనం చేయించడంపై కూడా సందేహాలు వ్యక్తం చేశారు. TCS ఇచ్చిన డేటాను ఫోరెన్సిక్‌ ఆడిట్‌ జరిపించాలని కోర్టును పిటిషనర్లు కోరారు. అదేవిధంగా పరీక్షల నిర్వహణలో ఏపీపీఎస్సీ కార్యదర్శి సీతారామాంజనేయుల ప్రమేయం లేకుండా చూడాలని కూడా అభ్యర్ధించారు. ఛైర్మన్‌ ను పక్కన పెట్టి రాష్ట్ర ప్రభుత్వ మద్దతుతో కార్యదర్శి సీతారామాంజనేయులలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు చేశారు.

పరీక్షలు, మూల్యాంకన విధానం…

గతంలో గ్రూప్‌-1 ప్రధాన పరీక్షల జవాబు పత్రాలను ఏపీపీఏస్సీ నిర్వహించే క్యాంప్‌లో పాల్గొని ప్రొఫెసర్లు నేరుగా మూల్యాంకనం చేసేవారు ఒక్కో పేపరును ఇద్దరు ప్రొఫెసర్లతో దిద్దించేవారు. వారిద్దరు ఇచ్చిన మార్కుల్లో 15% లేదా అంతకంటే ఎక్కువ తేడా వస్తే.. మూడోసారి వేరేవారితో దిద్దించేవారు. అయితే, ఈసారి ప్రశ్నపత్రాలు కాకుండా.. ప్రశ్నలను ట్యాబ్‌లలో ఇచ్చారు. జవాబు పత్రాలను స్కానింగ్‌ చేసి, ఎంపిక చేసిన ప్రొఫెసర్లకు ఆన్‌లైన్‌లో పంపారు.
వాటిని ప్రొఫెసర్లు ఆన్‌లైన్‌లోనే మూల్యాంకనం చేశారు. దీంతో మూల్యాంకన క్యాంపు నిర్వహించలేదు. మూల్యాంకనం కోసం థర్డ్‌పార్టీని ఎంపిక చేసే విషయంలో ఎలాంటి విధివిధానాలను పాటించారో స్పష్టత లేదు.

మూల్యాంకనం… సందేహాలు

జవాబు పత్రాలను డిజిటల్‌ విధానంలో మూల్యాంకనం చేయడంపై ప్రధానంగా పిటిషనర్ల తరఫున న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. అది చట్టవిరుద్ధమని, చరిత్ర, ఏపీ సంస్కృతి, భౌగోళిక శాస్త్రం తదితర సబ్జెక్టుల జవాబు పత్రాల్ని లోతైన అవగాహన ఉన్నవాళ్లే దిద్దగలరని వారు పేర్కొన్నారు. పేపర్లు దిద్దినవారు నిపుణులా కాదా అనేదాన్ని పరిగణనలోకి తీసుకోకుండా థర్డ్‌పార్టీ ద్వారా జవాబు పత్రాల మూల్యాంకనం చేయించారని ఆరోపించారు.

హైకోర్టు ఉత్తర్వులు…

ఇంటర్వ్యూలతోపాటు తదుపరి చర్యలన్నింటినీ నాలుగు వారాలపాటు నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. పరీక్ష ప్రక్రియ ప్రారంభమయ్యాక నిబంధనలను మార్చినట్లు ప్రాథమికంగా అభిప్రాయపడిన కోర్టు..మూల్యాంకనం కోసం థర్డ్‌పార్టీని ఎంపిక చేసే విషయంలో ఎలాంటి విధివిధానాలను పాటించారో వెల్లడించలేదని అభిప్రాయపడింది. మూల్యాంకనం చేసినవారి అర్హతలపై పిటిషనర్లు అభ్యంతరం లేవనెత్తినప్పుడు.. కనీసం వారి అర్హతలు, పూర్వ అనుభవం వెల్లడించాల్సిన బాధ్యత ఏపీపీఎస్సీపై ఉందని కోర్టు స్పష్టం చేసింది. కౌంటర్‌ అఫిడవిట్లో ఆ వివరాలను పొందుపరచలేదు. దీంతో హైకోర్టు ఉత్తర్వులతో నిన్న (17-06-2021) జరగాల్సిన ఇంటర్వూ ప్రక్రియ నిలిపివేసింది.

ఏపీపీఎస్సీ పరీక్షలు… తప్పుల తడకలు

ఇప్పటికే 2018 నోటిఫికేషన్‌కు సంబంధించి ప్రిలిమ్స్‌లో ఇచ్చిన ప్రశ్నల తెలుగు అనువాదంలో తప్పులు దొర్లాయి. దీనిపై కొందరు న్యాయపోరాటం చేయగా.. హైకోర్టు ఆదేశాలతో ‘కీ’ సరిచేశారు. దీంతో రెండుసార్లు ఫలితాలు ప్రకటించాల్సి వచ్చింది. 2016 గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ ప్రకారం చేపట్టిన నియామకాల్లోనూ చిన్న చిన్న సమస్యలొచ్చాయి. 2011లో నిర్వహించిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌లోనూ తప్పులు దొర్లాయి. ఈ నియామకాల మౌఖిక పరీక్షలు రద్దయ్యాయి.

మళ్లీ ప్రధాన పరీక్షల నుంచి నిర్వహించారు. ఇలా వరుస లోపాలతో నియామకాలు ఆలస్యం అవుతూ వస్తున్నాయి. దీనితో ఉన్నతోద్యోగాల్లో చేరాల్సిన అభ్యర్థులు సర్వీసుపరంగా కూడా నష్టపోతున్న పరిస్థితి ఏర్పడింది.

Also Read: AP Job Calendar Today: నిరుద్యోగులకు శుభ వార్త.. జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేయనున్న ముఖ్యమంత్రి జగన్

Online Degree Programmes: డిగ్రీ చదవాలనుకుంటున్నారా? అయితే శుభ‌వార్త‌.. ఇంట్లో కూర్చొని పూర్తి చేయొచ్చు