
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 19 యూనివర్సిటీల్లో అధ్యాపక పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 1523 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో బ్యాక్లాగ్ పోస్టులు 279, రెగ్యులర్ పోస్టులు 1,244 వరకు ఉన్నాయి. మొత్తం పోస్టుల్లో అత్యధికంగా ఆర్టీయూకేటీలో 311 పోస్టులు ఉన్నాయి. ఆ తర్వాత ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 246 ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు ఉన్నాయి. శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీలో 125 పోస్టులు, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో 103 పోస్టులు చొప్పున ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు మే 18వ తేదీ నుంచి ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్డీ, ఎంఫిల్లో ఉత్తీర్ణతతోపాటు యూజీసీ నెట్ లేదా ఏపీ ఎస్ఎల్ఈటీ లేదా సెట్లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే సంబంధిత పని అనుభవం కూడా ఉండాలి. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్లైన్లో జూన్ 8, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. నింపిన దరఖాస్తులను డౌన్లోడ్ చేసుకుని సంబంధిత వర్సిటీ అడ్రస్కు పోస్టు ద్వారా పంపించవల్సి ఉంటుంది. విద్యార్హతలు, రాత పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.