
అమరావతి, మే 15: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పాలిసెట్ 2025) తాజాగా ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ చేతుల మీదగా ఫలితాలను విడుదల చేశారు. తాజా ఫలితాల్లో పాలిసెట్లో ఏకంగా 19 మంది విద్యార్థులు 120కి 120 మార్కులు సాధించి అదరగొట్టారు. మొత్తం 19మంది విద్యార్థుల్లో ఐదుగురు అమ్మాయిలు, మిగతా వారంతా అబ్బాయిలే ఉన్నారు. వీరిలో 15 మంది ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన వారే కావడం మరో విశేషం.
ఆంధ్రప్రదేశ్ పాలీసెట్ 2025 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఈ విద్యార్థుల ప్రతిభను మంత్రి లోకేశ్ ప్రశంసిస్తూ ఎక్స్ ఖాతాలో పోస్టు ఎట్టారు. ఈ ఏడాది పాలిసెట్లో 95.36 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు తెలిపారు. రాష్ట్రంలోనే అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యధికంగా 98.66 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,39,840 మంది విద్యార్ధులు పాలిసెట్ పరీక్ష రాయగా.. అందులో 1,33,358 మంది ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి లోకేష్ తెలిపారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 30న పాలీసెట్ 2025 పరీక్షను స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ నిర్వహించిన విషయం తెలిసిందే. పాలీసెట్లో వచ్చిన ర్యాంకు ఆధారంగా రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల్లోని ఇంజినీరింగ్, నాన్-ఇంజినీరింగ్/ టెక్నాలజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
తెలంగాణ రాష్ట్రంలో మే 13న జరిగిన పాలిసెట్ 2025 పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 92.64 శాతం మంది హాజరయ్యారు. మొత్తం 1,06,716 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 98,858 మంది పరీక్ష రాసినట్లు స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (SBTET) కార్యదర్శి, పాలిసెట్ కన్వీనర్ ఎ పుల్లయ్య ఓ ప్రకటనలో వెల్లడించారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.