
జేఈఈ అడ్వాన్స్డ్లో మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులు దేశంలోని ప్రముఖ ఇంజినీరింగ్ సంస్థల్లో ప్రవేశాలకు సిద్ధమవుతుండగా, మిగతా విద్యార్థులు త్వరలో ప్రారంభంకానున్న ఏపీ ఈఏపీసెట్ 2026 కౌన్సెలింగ్పై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో ఏ బ్రాంచి ఎంపిక చేసుకుంటే భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉంటాయనే అంశంపై నిపుణులు కీలక సూచనలు చేస్తున్నారు.
ప్రస్తుతం దేశంలో అత్యధిక డిమాండ్ ఉన్న కోర్సుల్లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (CSE) మొదటి స్థానంలో ఉంది. AI, ML, డేటా సైన్స్ వంటి స్పెషలైజేషన్లతో ఈ కోర్సుకు మరింత ఆదరణ పెరిగింది. ఇండియా స్కిల్స్ రిపోర్ట్ ప్రకారం దాదాపు 80 శాతం సీఎస్ఈ గ్రాడ్యుయేట్లు ఉద్యోగాలు పొందుతున్నారు. డిజిటలైజేషన్ వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో కోడింగ్ నైపుణ్యాలు కలిగిన వారికి టెక్నాలజీ, ఫైనాన్స్, హెల్త్కేర్, ఈ-కామర్స్ రంగాల్లో విస్తృత అవకాశాలు లభిస్తున్నాయి.
సెమీకండక్టర్ తయారీ, 5జీ, 6జీ విస్తరణ, వీఎల్ఎస్ఐ చిప్ డిజైన్ రంగాల అభివృద్ధితో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (ECE) కోర్సు మళ్లీ ప్రాధాన్యం సంతరించుకుంటోంది. ఈ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు కోర్ ఎలక్ట్రానిక్స్ రంగంతో పాటు ఐటీ, సాఫ్ట్వేర్ రంగాల్లో కూడా కెరీర్ నిర్మించుకోవచ్చు. గేట్ ద్వారా డీఆర్డీవో, ఇస్రో, బీడీఎల్, ఐఓసీఎల్, షెయిల్, సామీర్ వంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో అవకాశాలు ఉన్నాయి.
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక ఇంధన వనరులు, స్మార్ట్ గ్రిడ్ వ్యవస్థలు విస్తరిస్తుండటంతో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ (EEE) కోర్సుకు మంచి డిమాండ్ ఏర్పడుతోంది. పవర్ సిస్టమ్స్ ఇంజినీర్, ఈవీ డిజైన్ ఇంజినీర్, ఆటోమేషన్ ఇంజినీర్ వంటి ఉద్యోగ అవకాశాలు ఈ కోర్సుతో అందుబాటులో ఉన్నాయి. గేట్ ద్వారా ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, బీహెచ్ఈఎల్ వంటి ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు పొందవచ్చు.
మెకానికల్ ఇంజినీరింగ్ (ME) కోర్సు చేసిన వారికి ప్రైవేటు రంగంలో మంచి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈవీలు, రోబోటిక్స్, ఆటోమేషన్ వంటి రంగాల్లో అదనపు స్పెషలైజేషన్ చేస్తే ఉద్యోగ అవకాశాలు మరింత మెరుగుపడతాయి. గేట్ స్కోర్ ఆధారంగా ఇస్రో, డీఆర్డీవో, పీఎస్యూల్లో ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది. అలాగే ఎస్ఎస్సీ జేఈ, ఆర్ఆర్బీ జేఈ వంటి ప్రభుత్వ ఉద్యోగ పరీక్షల్లోనూ అవకాశాలు లభిస్తాయి. సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన వారికి నిర్మాణ రంగం, మౌలిక వసతుల ప్రాజెక్టులు, రియల్ ఎస్టేట్ రంగాల్లో మంచి అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ శాఖల్లో కూడా ఈ కోర్సు విద్యార్థులకు ఉద్యోగావకాశాలు కొనసాగుతున్నాయి.
ఇంజినీరింగ్లో బ్రాంచి ఎంపిక అనేది కేవలం ప్రస్తుత ట్రెండ్ను బట్టి కాకుండా విద్యార్థి ఆసక్తి, నైపుణ్యాలు, భవిష్యత్ కెరీర్ లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని చేయాల్సిన నిర్ణయం అని నిపుణులు సూచిస్తున్నారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా సరైన కోర్సును ఎంపిక చేసుకుంటే మంచి ఉద్యోగ అవకాశాలు, ఉన్నత విద్య అవకాశాలు, మెరుగైన కెరీర్ను నిర్మించుకోవచ్చని చెబుతున్నారు.