
అమరావతి, ఫిబ్రవరి 18: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 16వ తేదీ నుంచి మొదలవనున్నాయి. ముందుగా ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించి, ఆ తర్వాత పదో తరగతి పరీక్షలు విద్యాశాఖ జరపనుంది. అయితే పదో తరగతి హాల్టికెట్లు మార్చి మొదటి వారంలోనే విడుదల చేయనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు కేవీ శ్రీనివాసులురెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్ధులు అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే లీప్ యాప్, మన మిత్ర వాట్సప్ నంబరులోనూ హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు.
హాల్ టికెట్లలో విద్యార్థుల పేర్లు, ఇంటి పేర్లు, పుట్టిన తేదీ వంటి వివరాలు ఏవైనా తప్పుగా ఉంటే సవరణకు అవకాశం కల్పిస్తామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. పరీక్ష అనంతరం కూడా మార్కుల మెమోలు జారీ చేసే వరకు విద్యార్థుల వివరాలను సరిచేసేందుకు అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. కాగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 16 నుంచి మార్చి 30వ తేదీ వరకు ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షల అనంతరం ఏప్రిల్ 4వ తేదీ నుంచే జవాబుపత్రాల మూల్యాంకనం ప్రారంభించాలని ప్రభుత్వ పరీక్షల విభాగం నిర్ణయించింది. ఏప్రిల్ 13వ తేదీ వరకు మొత్తం 10 రోజుల పాటు పదో తరగతి పబ్లిక్ పరీక్షల సమాధాన పత్రాల మూల్యాంకన ప్రక్రియ కొనసాగుతుంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.