
అమరావతి, ఫిబ్రవరి 13: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లు గురువారం (ఫిబ్రవరి 12) విడుదలయ్యాయి. ఈ మేరకు ఇంటర్మీడియట్ బోర్డు ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ హాల్ టికెట్లను వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. అలాగే విద్యార్ధుల తల్లిదండ్రుల ఫోన్ల నుంచి కూడా నేరుగా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాగా ఫిబ్రవరి 23 నుంచి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రాక్టికల్ పరీక్షలు కూడా ముగిశాయి. ఈ క్రమంలో ఇంటర్ హాల్ టికెట్లు ఇంటర్ బోర్డు విడుదల చేసింది. ఇంటర్ విద్యార్థులు శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి అధికారిక వెబ్సైట్ నుంచి హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి రంజిత్ బాషా ఓ ప్రకటనలో తెలిపారు
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల 2026 హాల్ టికెట్ల డౌన్ లోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు ఫస్ట్ ఇయర్ హాల్టికెట్ నంబర్ ఎంటర్ చేసి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఫస్ట్ ఇయర్ విద్యార్థులు పదో తరగతి హాల్టికెట్ నంబర్ లేదా ఆధార్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి హాల్ టికెట్ పొందవచ్చు. మనమిత్ర వాట్సాప్ నంబర్ 9552300009కు ‘హాయ్’ అని మెసేజ్ చేసి.. వాట్సప్ సేవల నుంచి కూడా హాల్టికెట్ను పొందవచ్చని చెప్పారు. అలాగే ఆయా కాలేజీల ప్రిన్సిపల్స్ తమ లాగిన్ వివరాలు ఎంటర్ చేసి కూడా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసి విద్యార్థులకు అందించవచ్చని బోర్డు పేర్కొంది. ఫీజుల బకాయిల పేరుతో ఏ కాలేజీ యాజమాన్యం హాల్టికెట్లను ఆపకూడదని ఆదేశించింది.
ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ఫిబ్రవరి 23 నుంచి, సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఫిబ్రవరి 24 నుంచి పరీక్షలు ప్రారంభం అవుతాయి. మార్చి 24వ తేదీ వరకు ఆయా తేదీల్లో ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్షలు కొనసాగుతాయి. అయితే మార్చి 3న జరగాల్సిన సెకండ్ ఇయర్ మ్యాథ్మెటిక్స్, సివిక్స్ పేపర్లు మార్చి 4కి మార్చారు. అలాగే మార్చి 20న జరగాల్సిన ఫస్ట్ ఇయర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్ పేపర్లు మార్చి 21కి మార్చింది. ఈ మేరకు విద్యార్ధులు, తల్లిదండ్రులు, కాలేజీలు గమనించాలని బోర్డు సూచించింది. మార్చి 3న హోలీ, మార్చి 20 రంజాన్ పండగ సెలవుల నేపథ్యంలో ఈ మార్పులు చేసినట్లు బోర్డు స్పష్టం చేసింది. మిగిలిన పరీక్షలు యథాతథంగా గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని వెల్లడించింది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.