
అమరావతి, మే 4: రాష్ట్ర ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పబ్లిక్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్ధులకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెలలో నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పరీక్షల షెడ్యూల్ కూడా విడుదలైంది. సప్లిమెంటరీ పరీక్షలు రాయగోరే విద్యార్ధులకు తొలుత ఇచ్చిన ప్రకటన మేరకు ఫీజు చెల్లింపు గడువు ఏప్రిల్ 15 నుంచి 22 వరకు చెల్లించవచ్చని పేర్కొంది. అయితే తాజాగా ఫీజు గడువును పొడిగిస్తూ ఇంటర్ బోర్డు ప్రకటన ఇచ్చింది. సోమవారం (మే 5) వరకు ఫీజు చెల్లింపు గడువును పొడిగించినట్లు ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి కృతికా శుక్లా తెలిపారు. ఇప్పటి వరకు ఫీజులు చెల్లించని విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని, ఇదే చివరి అవకాశమని, మరోసారి పొడిగింపు ఉండదని ఆమె స్పష్టం చేశారు.
కాగా ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు మే 12 నుంచి 20 వరకు జరగనున్న సంగతి తెలిసిందే. ఆయా తేదీల్లో పరీక్షలు రోజుకు రెండు సెషన్లలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. అలాగే మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరగనున్నాయి. అంటే ఉదయం ఫస్ట్ ఇయర్, మధ్యాహ్నం సెకండ్ ఇయర్ పరీక్షలు జరుగుతాయన్నమాట. ఇక ప్రాక్టికల్ ఎగ్జామ్స్ మే 28 నుంచి జూన్ 1 వరకు జరుగుతాయి. ఇంటర్ అడ్వాన్స్డ్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల పూర్తి షెడ్యూల్ ఈ కింద చెక్ చేసుకోవచ్చు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.