
అమరావతి, మార్చి 2: ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీ ఐసెట్ 2026) ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. నోటిఫికేషన్ ప్రకారం ఐసెట్ దరఖాస్తు గడువు ఈ రోజు (మార్చి 2)తో ముగియనుంది. అయితే ఈ గడువును పొడిగిస్తూ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రకటన జారీ చేసింది. తాజా ప్రకటన మేరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఐసెట్కు దరఖాస్తు చేసుకునేందుకు మార్చి 17వ తేదీ వరకు అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది. ఈ ఏడాది ఐసెట్ పరీక్ష ఆంధ్ర యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరగనుంది. ఏపీ ఐసెట్లో వచ్చిన ర్యాంకు ఆధారంగా 2026-27 విద్యా సంవత్సరానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు, అనుబంధ కాలేజీల్లో ఫుల్ టైం ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. కాగా ఈ ఏడాదికి ఐసెట్ ప్రవేశ పరీక్ష మే 2న రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరగనుంది.
ఏపీ ఐసెట్ 2026 దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీ ఈసెట్) 2026 దరఖాస్తు గడువు కూడా నేటితో (మార్చి 2) ముగియనుంది. దీనిన మార్చి 12 వరకు పొడిగిస్తూ ఉన్నత విద్యా మండలి ప్రకటన జారీ చేసింది. ఇందులో వచ్చిన ర్యాంకు ఆధారంగా పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ(మ్యాథమేటిక్స్) అభ్యర్థులకు 2026-2027 విద్యా సంవత్సరానికి బీఈ, బీటెక్, బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ విధానంలో నేరుగా రెండో ఏడాదిలో ప్రవేశాలు కల్పిస్తారు. ఆలస్య రుసుము రూ.10,000తో మార్చి 28, 2026 వరకు దరఖాస్తుకు అవకాశం ఉంటుంది. కాగా ఏపీ ఈసెట్ ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 23, 2026న రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నారు. ఫలితాలు మే 7, 2026వ తేదీన విడుదల చేస్తారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.