Constable Jobs 2025: కానిస్టేబుల్‌ ఉద్యోగానికి పీహెచ్‌డీ హోల్డర్ల దరఖాస్తులు..! నిరుద్యోగుల్లో అభద్రత

నిరుద్యోగ సమస్య మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో మరికాస్త ఎక్కువగా ఉందనడానికి తాజా ఉదంతమే నిదర్శనం. డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌తో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్న శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌ సర్కార్‌ తాజాగా 7,500 కానిస్టేబుల్ ఉద్యోగాల నియామకాలకు ప్రకటన ఇచ్చింది. అయితే ఈ పోస్టులకు ఊహించని విధంగా..

Constable Jobs 2025: కానిస్టేబుల్‌ ఉద్యోగానికి పీహెచ్‌డీ హోల్డర్ల దరఖాస్తులు..! నిరుద్యోగుల్లో అభద్రత
Madhya Pradesh Constable Recruitment

Updated on: Oct 12, 2025 | 5:51 AM

దేశ వ్యాప్తంగా నిరుద్యోగ సమస్య జడలు విప్పుకున్న భూతంలా భయపెడుతుంది. ఎన్నో ఆశలతో కష్టపడి చదివిన యువత.. డిగ్రీలు చేతికొచ్చాక ఉద్యోగం దొరక్క ఎందరో నిరాశకు గురవుతున్నారు. కొందరు ఏకంగా ప్రాణాలే తీసుకుంటున్నారు. ఈ సమస్య మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో మరికాస్త ఎక్కువగా ఉందనడానికి తాజా ఉదంతమే నిదర్శనం. డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌తో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్న శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌ సర్కార్‌ తాజాగా 7,500 కానిస్టేబుల్ ఉద్యోగాల నియామకాలకు ప్రకటన ఇచ్చింది. ఈ ఉద్యోగాలకు ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 9.5 లక్షల అప్లికేషన్లు రావడం అక్కడి నిరుద్యోగ సమస్యకు అద్దం పడుతుంది. ఇందులో వేలమంది ఇంజనీరింగ్‌, డిగ్రీ, పీజీ అభ్యర్థులతోపాటు పీహెచ్‌డీ అభ్యర్ధులు కూడా దరఖాస్తు చేసుకోవడం మరింత దిగ్భ్రాంతికరమైన విషయం.

నిజానికి కానిస్టేబుల్‌ నియామక పరీక్షకు కనీస విద్యార్హత కేవలం 10వ తరగతి మాత్రమే. అయితే 52 వేల మంది పోస్టుగ్రాడ్యుయేట్లు, 33 వేల మంది గ్రాడ్యుయేట్లు, 12 వేల మంది ఇంజనీర్లు, దాదాపు 50 మంది పీహెచ్‌డీ హోల్డర్లు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పోస్టులకు ఎంపికైతే నెలకు రూ. 19,500 నుంచి రూ. 62,000 మధ్య జీతం అందిస్తారు. మధ్యప్రదేశ్‌లో నిరుద్యోగ సంక్షోభాన్ని, ప్రభుత్వ ఉద్యోగాల కోసం యువతలో దాగిన నిరాశ నిస్పృహలను ఈ కథనం ప్రతిబింబిస్తుంది. అర్హతలు తక్కువగా ఉన్న చాలా మంది యువకులు కానిస్టేబుల్ కొలువుల కోసం పోటీ పడుతున్నారు. ఖాకీ యూనిఫాం ఇప్పుడు విధిని మాత్రమే కాకుండా గౌరవం, భద్రత, మనుగడను కూడా సూచిస్తుంది. ఇక ఈ పోస్టులకు అక్టోబర్‌ 30న రెండు షిఫ్టులలో ఆన్‌లైన్‌ విధానంలో నియామక పరీక్ష జరగనుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష భోపాల్, ఇండోర్, జబల్పూర్, రేవా, సాగర్, రత్లం, ఉజ్జయినితో సహా 11 జిల్లాల్లో జరుగుతుంది.

ఉన్నత చదువులు చదువుకున్నవారు కూడా 10వ తరగతి స్థాయి కానిస్టేబుల్‌ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడం నిరుద్యోగ సమస్య ఎంత తీవ్రంగా ఉందో అవగత మవుతుంది. మధ్యప్రదేశ్‌లో ఉద్యోగ అవకాశాలు బాగా తగ్గిపోవడంతో డిగ్రీ, పీజీ హోల్డర్లు సైతం చిన్న ఉద్యోగమైనా దొరికితే చాలనుకునే పరిస్థితి ఏర్పడింది. ఉన్నత డిగ్రీ ఉన్నా మంచి ఉద్యోగం ఇక్కడ దొరకడం లేదని, బతకడానికి వేరే మార్గంలేక చిన్న స్థాయి ఉద్యోగాలకు కూడా దరఖాస్తు చేసుకుంటున్నట్లు పలువురు నిరుద్యోగులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.

Follow Us