కేంద్ర ప్రభుత్వ బంపరాఫర్‌.. లోగో డిజైన్‌ చేయండి.. రూ.50 వేలు గెలవండి!

కేంద్ర ప్రభుత్వం MGNREGA స్థానంలో తెస్తున్న VB-GRAMG Act పథకానికి లోగో రూపకల్పన పోటీని ప్రకటించింది. గ్రామీణాభివృద్ధి, ఉపాధి అవకాశాలు, స్వయం సమృద్ధిని ప్రతిబింబించే లోగోకు రూ. 50,000 బహుమతి. MyGov వెబ్‌సైట్‌ లో మార్చి 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

కేంద్ర ప్రభుత్వ బంపరాఫర్‌.. లోగో డిజైన్‌ చేయండి.. రూ.50 వేలు గెలవండి!
Vb Gramg Act Logo Competiti

Updated on: Mar 09, 2026 | 6:00 AM

కేంద్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన ఆఫర్‌ను తీసుకొచ్చింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) స్థానంలో తీసుకువస్తున్న వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్) VB-GRAMG Act పథకానికి లోగో రూపకల్పన కోసం దేశవ్యాప్తంగా ఓ ప్రత్యేక పోటీని ప్రకటించింది. ఈ పోటీలో విజేతగా నిలిచే వ్యక్తికి రూ.50,000 నగదు బహుమతిని అందజేస్తామని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గ్రామీణాభివృద్ధి, ఉపాధి అవకాశాలు, స్వయం సమృద్ధి వంటి అంశాలను ప్రతిబింబించేలా లోగో ఉండాలని ప్రభుత్వం సూచించింది. వికసిత్ భారత్ లక్ష్యాలను ప్రతిబింబించేలా సృజనాత్మకతతో కూడిన డిజైన్‌లను రూపొందించాలని ప్రజలకు పిలుపునిచ్చింది. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ఉద్యోగ కల్పన, జీవనోపాధి మెరుగుదల వంటి అంశాలు లోగోలో స్పష్టంగా కనిపించేలా ఉండాలని పేర్కొంది.

ఈ పోటీలో పాల్గొనాలనుకునే వారు కేంద్ర ప్రభుత్వ MyGov అధికారిక వెబ్‌సైట్‌ లోకి లాగిన్ అయి తమ డిజైన్‌ను సమర్పించాలి. ఒక వ్యక్తి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ లోగోలను కూడా సమర్పించవచ్చు. అయితే లోగో పూర్తిగా ఒరిజినల్‌గా ఉండాలని, ఎలాంటి కాపీరైట్ ఉల్లంఘనలు లేకుండా రూపొందించాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. లోగోలను సమర్పించడానికి మార్చి 20 వరకు గడువు ఇవ్వబడింది. ఎంపికైన ఉత్తమ లోగోను VB-GRAMG Act పథకానికి అధికారిక చిహ్నంగా ఉపయోగించనున్నారు. పోటీకి సంబంధించిన పూర్తి నిబంధనలు, మార్గదర్శకాలు MyGov వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఇక కొత్తగా ప్రతిపాదించిన VB-GRAMG Act బిల్లు-2025లో గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కీలక మార్పులు చేశారు. ఇప్పటివరకు 100 రోజులుగా ఉన్న ఉపాధి హామీని 125 రోజుల వరకు పెంచడం ముఖ్య నిర్ణయంగా భావిస్తున్నారు. ఈ చర్య గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలను పెంచి, కుటుంబాల ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. సృజనాత్మకత కలిగిన యువత, డిజైనర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకుని దేశవ్యాప్త గుర్తింపు పొందవచ్చని అధికారులు సూచిస్తున్నారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us