
ఇటీవల ఎక్కడ చూసినా యూపీఐ లావాదేవీలు జరుగుతున్నాయి. ప్రతీఒక్కరి స్మార్ట్ ఫోన్లలో ఏదోక యూపీఐ యాప్ అనేది ఉంటుంది. ఇక వీధి వ్యాపారి నుంచి షాపింగ్ మాల్స్ వరకు ప్రతీచోట క్యూఆర్ కోడ్ స్కానర్లు దర్శనమిస్తున్నాయి. దీంతో సింపుల్గా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి వ్యాపారికి నిధులు బదిలీ చేస్తున్నారు. జనాలు యూపీఐకు తెగ అలవాటు పడిపోయారు. యూపీఐ లావాదేవీలు ఉచితంగా నిర్వహించుకోవచ్చు. ఇందుకు ప్రభుత్వం, బ్యాంకులు ఎలాంటి ఛార్జిలు విధించడం లేదు. కానీ యూపీఐ వ్యవస్థ నిర్వహణ కోసం ప్రభుత్వం, పేమెంట్ అగ్రిగేటర్లు, బ్యాంకులు, చెల్లింపు కంపెనీలు, ఇతర సిస్టమ్ సంబంధిత కంపెనీలకు చాలానే ఖర్చు అవుతుంది. యాప్, సాంకేతికత, కస్టమర్ సర్వీస్తో పాటు సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ స్టోరేజ్, మోసాల నివారణ, నెట్ వర్క్ పరిక్షణ కోసం కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది.
డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ నిర్వహణ, పర్యక్షవేణ కోసం ప్రతీ ఏటా రూ.20 వేల కోట్ల వరకు ఖర్చు అవుతుందని ఓ అంచనా. అంటే ప్రతీ లావాదేవీకి 80 పైసల ఖర్చు అవుతుందట. యూపీఐ, రూపే డెబిట్ కార్డు డిజిటల్ చెల్లింపులకు సంబంధించి మౌలిక సదుపాయాల కోసం ప్రతీ ఏటా రూ.10 వేల కోట్ల ఖర్చు అవుతుంది. డిజిటల్ చెల్లింపుల రంగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం 2021-22, 2024-25 మధ్య రూ.8370 కోట్లు సబ్సిడీ అందించింది. డిజిటల్ చెల్లింపు కంపెనీలు చేసే ఖర్చులో ప్రభుత్వం అందించే సబ్సిడీ కేవలం 11 శాతమేనని చెప్పవచ్చు. దీంతో కంపెనీలు ఎక్కువ భారాన్ని మోస్తున్నాయి. యూపీఐ పేమెంట్స్పై వినియోగదారులకు ఎలాంటి ఛార్జీలు విధించడం లేదు. దీంతో ఈ భారం కంపెనీలపైనే పడుతుంది. కంపెనీలు తమ మౌలిక సదుపాయాల విస్తరణ, సిస్టమ్ అప్గ్రేడ్, ఉద్యోగుల జీతాల రూపంలో కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం నుంచి అందే సబ్సిడీలు సరిపోవడం లేదని కంపెనీలు మొర పెట్టుకుంటున్నాయి.
అయితే కేంద్ర ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాపారులకు యూపీఐ చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేటు అమలు చేయాలని నిర్ణయించింది. అదే వినియోగదారుడు చేసిన పేమెంట్ ప్రాసెస్ చేయాలంటే వ్యాపారి నుంచి బ్యాంకులు, పేమెంట్ ఆపరేటర్లు కొంత ఛార్జీలు వసూలు చేస్తాయి. పెద్ద వ్యాపారులకు మాత్రమే ఈ ఛార్జీలు విధించనున్నారని తెలుస్తోంది. దీని వల్ల చిన్న వ్యాపారులు, సామాన్య వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. చిన్న వ్యాపారులకు ఎప్పటిలాగే ఉచితంగా కొనసాగుతుంది. పెద్ద వ్యాపారుల నుంచి వసూలు చేసే సొమ్మును యూపీఐ మౌలిక సదుపాయాల విస్తరణ కోసం ఖర్చు చేయనున్నారు.