
దేశ మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్ల హవా కొనసాగుతోంది. రోజుకో కొత్త మోడల్ విడుదలవుతోంది. అత్యాధునిక ఫీచర్లు, అందుబాటు ధరలో ఇవి ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో హరియాణాకు చెందిన ప్రముఖ ఈ-బైక్స్ సంస్థ జెలియో కొత్త స్కూటర్లను ఆవిష్కరించింది. ఈవా పేరుతో మూడు రకాల మోడళ్లను ఆవిష్కరించింది. కేవలం రూ.56,051 నుంచి వీటి ధరలు ప్రారంభవుతున్నాయి. వంద కిలోమీటర్ల రైడింగ్ పరిధి, యాంటి థెఫ్ట్ అలారాలు కలిగిన ఈ బైక్ ల ప్రత్యేకతలు, ఇతర వివరాలను తెలుసుకుందాం.
హరియాణాకు చెందిన ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ అయిన జెలియో ఇ బైక్స్ తన ఈవా ఇ-స్కూటర్ శ్రేణిని ప్రారంభించింది. తన పోర్ట్ఫోలియోలో కొత్త ఉత్పత్తులను చేర్చింది. ఈవా, ఈవా ఈకో, ఈవా జెడ్ ఎక్స్ ప్లస్ అనే మూడు రకాల మోడళ్లను విడుదల చేసింది. వీటి ధరలు రూ. 56,051 నుంచి రూ. 90,500 (ఎక్స్-షోరూమ్) ఉన్నాయి.
ఈవా స్కూటర్ లో 60/72V బీఎల్ డీసీ మోటార్ ఏర్పాటు చేశారు. ఇది 180 కిలోల లోడింగ్ సామర్థ్యంతో 80 కిలోల బరువు ఉంటుంది. రెండు చివర్లలో డ్రమ్ బ్రేక్లున్నాయి. యాంటీ థెఫ్ట్ అలారం, రివర్స్ గేర్, పార్కింగ్ స్విచ్, ఆటో రిపేర్ స్విచ్, యూఎస్ బీ ఛార్జర్, డిజిటల్ డిస్ప్లే అదనపు ప్రత్యేకతలు. బ్లూ, గ్రే, వైట్, బ్లాక్ రంగులలో ఐదు వేర్వేరు బ్యాటరీ ఆప్షన్ల మధ్య అందుబాటులో ఉంది. దీని రేంజ్ 55 నుంచి 100 కిలోమీటర్లు ఉంటుంది.
ఈవా ఈకో మోడల్ లో వెనుక డ్రమ్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్ సెటప్తో అమర్చారు. ఈవా స్కూటర్ మాదిరిగానే రివర్స్ గేర్, పార్కింగ్ స్విచ్, యూఎస్ బీ ఛార్జింగ్తో సహా అన్ని రకాల ఫీచర్లు ఏర్పాటు చేశారు. దీనిలో మూడు బ్యాటరీ ఎంపికలు ఉన్నాయి. ఈవా ఈకో రేంజ్ 50 నుంచి 100 కిలోమీటర్ల వరకూ ఉంటుంది..
ఈవా జెడ్ ఎక్స్ ప్లస్ లో కూడా పైన తెలిపిన రెండు స్కూటర్ల ఫీచర్లు ఉంటాయి. ఐదు విభిన్న బ్యాటరీ ప్యాక్లను ఎంపిక చేసుకోవచ్చు. కంపెనీ లెడ్ యాసిడ్, లిథియం-అయాన్ బ్యాటరీలపై ఒక ఏడాది, లేదా పదివేల కిలోమీటర్ల వారంటీని అందిస్తోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..