
భారత్లో త్వరలో టెస్లా కార్లు పరుగులు పెట్టబోతున్నాయి. అమెరికాలో మొన్నీమధ్య ప్రధాని మోదీ – టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మీటింగ్ తర్వాత కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత్లో ఉద్యోగుల ఎంపిక ప్రక్రియకు మస్క్ శ్రీకారం చుట్టారు. 13 రకాల ఉద్యోగాలకు ప్రకటన ఇచ్చింది టెస్లా. ముంబై, ఢిల్లీలో టెస్లా రిక్రూట్మెంట్లు జరుగుతాయి. కస్టమ్స్ సుంకాన్ని తగ్గించాలని కొన్నేళ్లుగా మస్క్ పట్టుబడుతున్నారు. దీంతో లగ్జరీ కార్ల దిగుమతులపై కస్టమ్స్ సుంకాన్ని ఇటీవలే 110 శాతం నుంచి 70 శాతానికి తగ్గించింది భారత్. దీంతో దిగుమతి సుంకం భారం 40వేల డాలర్లు తగ్గింది.
వాస్తవానికి ప్రధాని మోదీని గత ఏడాది ఏప్రిల్లోనే ఎలాన్ మస్క్ కలుసుకోవాల్సి ఉంది. అయితే తమ కార్లను భారత్లో దిగుమతి చేయడానికి- కస్టమ్స్ సుంకాలు తగ్గించాలని మస్క్ అప్పటినుంచి కోరుతున్నారు. అయితే భారత్ మాత్రం, ఇక్కడే అసెంబ్లింగ్ యూనిట్ తెరవాలని కోరింది. ఈ అంశంపై ఏకాభిప్రాయం కుదరలేదు. అయితే మోదీ అమెరికాలో పర్యటించిన తర్వాత, మార్పు వచ్చింది. తాజాగా 13 రకాల పొజిషన్లకు ఉద్యోగులను ఎంపిక చేయాలని మస్క్ నిర్ణయించారు. ఇందులో ఇన్సైడ్ సేల్స్ అడ్వైజర్, కస్టమర్ సపోర్ట్ సూపర్వైజర్, పార్ట్స్ అడ్వైజర్, సర్వీస్ టెక్నీసియన్ వంటి పోస్టులు ఉన్నాయి. మొత్తమ్మీద భారతీయ రోడ్లపై టెస్లా కార్లు పరుగులు తీయడానికి రంగం సిద్ధం అవుతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..