
హైదరాబాద్ నుంచి ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నైకు రెండు హైస్పీడ్ బుల్లెట్ రైళ్ల కారిడార్లను నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇవి సర్వే, అలైన్మెంట్, డీపీఆర్ దశల్లో ఉన్నాయి. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లే మార్గానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అలైన్మెంట్లో కీలక మార్పులను కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. శంషాబాద్, ప్యూచర్ సిటీ, శ్రీశైలం మీదుగా బెంగళూరుకు రూట్ మ్యాప్ను ప్రతిపాదించింది. ఈ మేరకు అలైన్మెంట్లో మార్పులు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. హైదరాబాద్ నుంచి శ్రీశైలంకు వేలాదిమంది తరచూ వెళ్తుంటారు. ఇలాంటివారికి ఉపయోగపడేలా చేయాలనే ఉద్దేశంతో అలైన్మెంట్ మార్చాలని సీఎం రేవంత్ సూచించారు.
ప్రస్తుతం హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లాలంటే గంటల కొద్ది సమయం పడుతుంది. అదే బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తే కేవలం గంటలోనే వెళ్లవచ్చు. గతంలో కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసిన అలైన్మెంట్ ప్రకారం హైదరాబాద్-బెంగళూరు బుల్లెట్ రైల్ ప్రాజెక్ట్ తెలంగాణ పరిధిలో 218 కిలోమీటర్ల మేర ఉంటుంది. తెలంగాణలో మూడు స్టేషన్లు ఏర్పాటు చేసేలా ప్లాన్ చేశారు. శంషాబాద్, మహబూబ్ నగర్, కర్నూలు మీదుగా ఈ రూట్ ఫిక్స్ చేశారు. తాజాగా అధికారులతో సమావేశం నిర్వహించిన రేవంత్ రెడ్డి.. ఈ మార్గానికి సంబంధించి అలైన్మెంట్లో మార్పులు చేయాలని కేంద్రానికి సూచించారు. శంషాబాద్, భారత్ ఫ్యూచర్సిటీ, ఆమనగల్లు, మన్ననూరు, శ్రీశైలం, సోమశిల మీదుగా బెంగళూరుకు ప్రతిపాదించారు.
శ్రీశైలంకు బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తే భక్తులకు మరింత మేలు చేకూరుతుందని సీఎం రేవంత్ తెలిపారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి నివేదించి మార్పులు జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఇక హైదరాబాద్-చెన్నై బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు సంబంధించి కూడా పలు మార్పులు సూచించారు. ఈ కారిడార్ మొత్తం 744 కిలోమీటర్ల మేర ఉండనుండగా.. 236 కిలోమీటర్ల మేర తెలంగాణ పరిధిలో ఉంటుంది. రాష్ట్రంలో ఐదు స్టేషన్లు ఉండనున్నాయి. ఈ ప్రాజెక్టును శంషాబాద్, భారత్ సిటీ, డ్రైపోర్ట్, హాలియా, వాడపల్లి, దాచేపల్లి మీదుగా కేంద్రం తొలుత ఫిక్స్ చేసింది. అయితే బాటసింగారం, నార్కట్ పల్లి, సూర్యాపేట, ఖమ్మం మీదుగా అమరావతికి చేరుకునేలా మార్పులు సూచించారు.