
ఈ ఏడాది ప్రారంభం నుండి ఇన్వెస్టర్లకు చుక్కలు చూపిస్తున్న వెండి ధరలు ఇప్పుడు సరికొత్త మలుపు తిరుగుతున్నాయి. ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి చేరుకున్న సిల్వర్, అకస్మాత్తుగా పతనమై మళ్లీ పుంజుకోవడం ఇప్పుడు మార్కెట్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.రాబోయే కొన్ని వారాలు వెండి భవిష్యత్తును నిర్ణయించనున్నాయి. గత నెల జనవరి 29న మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్లో వెండి ధర కిలోకు రూ.4,20,000 అనే చారిత్రాత్మక రికార్డును తాకింది. అయితే ఆ తర్వాత ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. గ్లోబల్ మార్కెట్లో నగదు లభ్యత తగ్గడం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై తీసుకుంటున్న నిర్ణయాలు ఇన్వెస్టర్లను అయోమయంలో పడేయడం దీనికి ప్రధాన కారణాలుగా చెప్పొచ్చు.
ప్రస్తుతం ధరలలో అస్థిరత ఉన్నప్పటికీ, వెండికి ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. వెండి ధరలు భవిష్యత్తులో మళ్లీ పెరగడానికి బలమైన కారణాలు కనిపిస్తున్నాయి.
తక్కువ ఉత్పత్తి: గత కొన్నేళ్లుగా వెండి ఉత్పత్తి, మార్కెట్ డిమాండ్కు తగ్గట్టుగా లేదు.
టెక్నాలజీ వాడకం: సౌరశక్తి, ఎలక్ట్రిక్ వాహనాలు, ఎలక్ట్రానిక్ పరికరాల తయారీలో వెండి వినియోగం విపరీతంగా పెరిగింది.
పెట్టుబడులు: ఫిజికల్ సిల్వర్ తో పాటు సిల్వర్ ETFలపై ఇన్వెస్టర్లు మక్కువ చూపుతున్నారు.
ప్రస్తుత ధరల తగ్గుదల తాత్కాలికమేనని, ఇది డిమాండ్ లేక జరిగింది కాదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో US ఆర్థిక గణాంకాలు, కేంద్ర బ్యాంకుల నిర్ణయాలపై వెండి ధరలు ఆధారపడి ఉంటాయి. సాధారణంగా యూఎస్ డాలర్ బలహీనపడితే, వెండి ధరలు పెరుగుతాయి. కాగా ప్రస్తుతం వెండి ధర కిలోకు రూ. 2,90,000లుగా ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి