
వయోవృద్ధుల ఆర్థిక భద్రత కోసం ప్రభుత్వం అందిస్తున్న పథకాలలో SCSS (సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్స్) ఒక ముఖ్యమైన ఎంపికగా నిలుస్తోంది. పెరుగుతున్న మార్కెట్ అస్థిరత, ఈక్విటీ పెట్టుబడుల్లో ఉన్న ప్రమాదాల నేపథ్యంలో స్థిరమైన, హామీతో కూడిన రాబడుల కోసం సీనియర్ సిటిజన్లు ఇప్పుడు ఈ పథకం వైపు మొగ్గు చూపుతున్నారు. పదవీ విరమణ తర్వాత ఆదాయం తగ్గిపోవడం, కానీ ఖర్చులు కొనసాగుతుండటంతో వృద్ధులకు సురక్షితమైన పెట్టుబడి అవసరం అత్యంత కీలకం. ఈ నేపథ్యంలో SCSS పథకం సార్వభౌమ హామీతో పాటు ప్రస్తుతం 8.2 శాతం వడ్డీ రేటుతో ఆకర్షణీయంగా మారింది. ఈ పథకంలో కనీసం రూ.1,000 నుండి గరిష్టంగా రూ.30 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.
ఐదేళ్ల కాలపరిమితితో ప్రారంభమయ్యే ఈ పథకాన్ని మరో మూడు సంవత్సరాలు పొడిగించే అవకాశం కూడా ఉంది. ఈ పథకంలో వడ్డీ చెల్లింపు విధానం కూడా ప్రత్యేకంగా ఉంటుంది. నెలవారీగా కాకుండా, ప్రతి త్రైమాసికానికి ఒకసారి వడ్డీ జమ అవుతుంది. ఏప్రిల్, జూలై, అక్టోబర్, జనవరి నెలల మొదటి పనిదినాల్లో, ఈ వడ్డీ నేరుగా ఖాతాదారుని సేవింగ్స్ అకౌంట్లోకి జమ అవుతుంది. దీని ద్వారా వృద్ధులకు ఒక క్రమమైన ఆదాయ ప్రవాహం లభిస్తుంది.
SCSS ఖాతా తెరవడం కూడా చాలా సులభం. ఆధార్, పాన్ కార్డు, ఓటర్ ఐడి, పాస్పోర్ట్ వంటి గుర్తింపు, చిరునామా పత్రాలు సమర్పించడం ద్వారా పోస్టాఫీసులు లేదా బ్యాంకుల్లో ఈ ఖాతాను ప్రారంభించవచ్చు. అదనంగా, పాస్పోర్ట్ సైజు ఫోటో, వయస్సు రుజువు వంటి పత్రాలు అవసరం. పన్ను ప్రయోజనాల పరంగా కూడా ఈ పథకం ప్రయోజనకరంగా ఉంటుంది. పాత పన్ను విధానాన్ని ఎంచుకున్న వారు, SCSSలో పెట్టుబడి చేసిన మొత్తాన్ని ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 సెక్షన్ 80C కింద మినహాయింపుగా క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే సంవత్సరానికి వడ్డీ రూ.1 లక్షను మించినట్లయితే, మూలం వద్ద పన్ను (TDS) కత్తిరించబడుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి