
భారత వ్యాపార రంగంలో మరో కీలక పరిణామం జరిగింది. ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్, వాల్ట్ డిస్నీ మధ్య ఒప్పందం కుదిరింది. తమ మీడియా వ్యాపారాలైన వయాకామ్ 18, స్టార్ ఇండియా విలీనానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి. 2 సంస్థలు కలిసి రూ.70,352 కోట్ల విలువైన జాయింట్ వెంచర్ ఏర్పాటుకు నిర్ణయించాయి. సంయుక్త సంస్థలో రిలయన్స్ రూ.11,500 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఈ ఒప్పందంలో భాగంగా రిలయన్స్కు చెందిన వయాకామ్ 18 స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో విలీనం కానుంది. జాయింట్ వెంచర్కు రిలయన్స్ ఇండస్ట్రీస్ నేతృత్వం వహిస్తుంది. విలీన సంస్థలో రిలయన్స్కు 16.34 శాతం, వయాకామ్ 18కు 46.82 శాతం, డిస్నీకి 36.84 శాతం చొప్పున వాటాలుంటాయి. ఈ మీడియా వెంచర్కు ముకేశ్ అంబానీ భార్య నీతా అంబానీ ఛైర్పర్సన్గా వ్యవహరిస్తారు. వాల్ట్ డిస్నీ మాజీ ఎగ్జిక్యూటివ్ ఉదయ్ శంకర్ వైస్ ఛైర్మన్గా ఉంటారు.
ఈ ఒప్పందం ద్వారా భారత వినోద పరిశ్రమలో సరికొత్త శకానికి నాంది పలికినట్లు అయ్యిందన్నారు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీ. ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ మీడియా గ్రూప్గా ఉన్న డిస్నీతో వ్యూహాత్మక జాయింట్ వెంచర్ను ఏర్పాటు చేస్తుండడం సంతోషంగా ఉందన్నారు. దీని వల్ల తమ వ్యాపారాభివృద్ధితో పాటు దేశంలోని ప్రేక్షకులకు సరసమైన ధరకే కంటెంట్ను అందించడం వీలు పడుతుందన్నారాయన. డిస్నీని రిలయన్స్ గ్రూప్లో కీలక భాగస్వామిగా సాదరంగా ఆహ్వానిస్తున్నామన్నారు ముకేశ్ అంబానీ. రిలయన్స్తో ఒప్పందం ద్వారా దేశంలోనే అతిపెద్ద మీడియా కంపెనీగా అవతరించనున్నామని, ప్రేక్షకులకు నాణ్యమైన ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ కంటెంట్ను అందించడం వీలు పడుతుందన్నారు వాల్ట్ డిస్నీ సీఈఓ బాబ్ ఐగర్.
ఈ ఒప్పందానికి నియత్రణ సంస్థలు, వాటాదారుల నుంచి ఆమోదం లభించాల్సి ఉంది. 2024 చివరి త్రైమాసికంలో గానీ, 2025 తొలి త్రైమాసికానికి ఈ ప్రక్రియ పూర్తి కానుంది. విలీనానంతర సంస్థ దేశంలోని దిగ్గజ వినోద రంగ సంస్థల్లో ఒకటిగా నిలవనుంది. స్టార్ ఇండియా నుంచి ఎనిమిది భాషల్లో 70 ఛానళ్లు, రిలయన్స్కు చెందిన వయాకామ్ 18 నుంచి 38 ఛానళ్లు కలిపి మొత్తం 120 టెలివిజన్ ఛానళ్లు ఒకే గొడుకు కిందకు రానున్నాయి. ఇవి కాకుండా డిస్నీ హాట్స్టార్, జియోసినిమా పేరుతో రెండు స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లు ఉండనున్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..