
సాధారణంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరి దగ్గరైనా కొంచెం ఎక్కువ డబ్బు ఉంటే, మొదట వచ్చే ఆలోచన “మరో ఇల్లు కొందాం” అని. ఇప్పటికే ఒక సొంత ఇల్లు ఉన్నా, రెండో ఇంటిని ఇన్వెస్ట్మెంట్గా చూస్తుంటాం. బ్యాంకు లోన్ తీసుకుని, వచ్చే రెంట్ ద్వారా ఈఎంఐ చెల్లించేసి, ఒక ఆస్తిని వెనక వేయాలనేది చాలా మంది ప్లాన్. అయితే, ఈ పద్ధతి ఆర్థికంగా ఎంతవరకు లాభదాయకం? బిజినెస్ నిపుణులు ఏం చెబుతున్నారంటే.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఒక కోటి రూపాయల ఇంటిని ఉదాహరణగా తీసుకుందాం. దీని కోసం మీరు సుమారు 28 లక్షల రూపాయలు(డౌన్ పేమెంట్, రిజిస్ట్రేషన్, ఇంటీరియర్) మొదట ఖర్చు చేయాలి. మిగిలిన 80 లక్షల లోన్ మీద నెలకు 70 వేల ఈఎంఐ పడుతుంది. రెంట్ ఒక 30 వేలు వచ్చినా, మీరు మీ జేబు నుండి నెలకు మరో 30 నుంచి 40 వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా 20 ఏళ్ల తర్వాత ఆ ఇంటి విలువ సుమారు 4 కోట్లు అవ్వచ్చు. కానీ, ఇదే మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్స్లో పెడితే లెక్కలు మారుతాయి.
మొదట పెట్టిన 28 లక్షలను లంసమ్గా, నెలకు కట్టే 30 వేల రూపాయలను ఎస్ఐపీగా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే, 20 ఏళ్ల తర్వాత సగటున 12-13 శాతం రాబడితో మీ సంపద 6 కోట్ల రూపాయలకు చేరుకునే అవకాశం ఉంది. అంటే, ఇంటి మీద వచ్చే లాభం కంటే ఇది దాదాపు 2 కోట్లు ఎక్కువ. ఇక్కడే మనం ఆలోచించాల్సిన మరో విషయం ‘లిక్విడిటీ’. అత్యవసరంగా డబ్బు కావాల్సి వస్తే కోటి రూపాయల ఇంటిని వెంటనే అమ్మలేము, కానీ మ్యూచువల్ ఫండ్స్ నుండి మనకు కావాల్సినంత డబ్బును ఎప్పుడైనా వెనక్కి తీసుకోవచ్చు.
అంతేకాకుండా, ఇంటికి మెయింటెనెన్స్ ఖర్చులు, అద్దెకు ఉండేవారి సమస్యలు, బిల్డింగ్ తరుగుదల వంటివి ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్లో అవేమీ ఉండవు. అయితే, ఇది కేవలం ఒక ఆర్థిక విశ్లేషణ మాత్రమే. రియల్ ఎస్టేట్ అనేది ఒక భౌతిక ఆస్తి కాబట్టి చాలామంది దానికి ప్రాధాన్యత ఇస్తారు. కానీ, సంపద సృష్టించడమే లక్ష్యం అయితే మాత్రం డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో ఉండటం మంచిదని బిజినెస్ నిపుణులు అంటున్నారు. మీరు పెట్టుబడి పెట్టే ముందు ఒక ఆర్థిక నిపుణుడిని సంప్రదించి, మీ రిస్క్ సామర్థ్యాన్ని బట్టి నిర్ణయం తీసుకోవడం బెటర్ అని చెబుతున్నారు.