AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: పర్యావరణ పరిరక్షణకు రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ఈ నెలాఖరుకు అందుబాటులోకి హైడ్రోజన్ ఇంజిన్

భారతదేశంలో చౌకైన రవాణా సాధనంగా భారత రైల్వేలు ఏళ్లుగా ప్రజాదరణ పొందుతున్నాయి. ముఖ్యంగా దూరప్రాంత ప్రయాణాలు అంటే ప్రజలు రైలు ప్రయాణాన్నే ఎంచుకుంటారు. అయితే మారుతున్న టెక్నాలజీకు అనుగుణంగా ఎలక్ట్రానిక్ రైలు ఇంజిన్‌ల కంటే ఇటీవల హైడ్రోజన్ ఇంజిన్లతో నడిచే రైళ్లపై రైల్వే శాఖ కీలక ప్రకటన చేసింది. ఈ నెలాఖరు నుంచి హైడ్రోజన్ ఇంజిన్‌తో నడిచే రైలును ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.

Indian Railways: పర్యావరణ పరిరక్షణకు రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ఈ నెలాఖరుకు అందుబాటులోకి హైడ్రోజన్ ఇంజిన్
Hydrogen Engine
Nikhil
|

Updated on: Mar 07, 2025 | 4:00 PM

Share

స్థిరమైన ప్రజా రవాణా దిశగా భారత రైల్వేలు మార్చి 31 నాటికి దేశంలో మొట్టమొదటి హైడ్రోజన్ ఇంధనంతో నడిచే రైలును ప్రారంభించేందుకు సిద్ధంగా ఉందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా తీసుకున్న ఈ నిర్ణయం భారతదేశాన్ని జర్మనీ, ఫ్రాన్స్, చైనా, యునైటెడ్ కింగ్‌డమ్ వంటి దేశాలతో పాటు గ్రీన్ మొబిలిటీ దేశాల సరసన చేరుస్తుంది. రైల్వే మంత్రిత్వ శాఖ 2023-24లో 35 హైడ్రోజన్ ఇంధన సెల్ ఆధారిత రైళ్ల సముదాయాన్ని అభివృద్ధి చేయడానికి రూ.2,800 కోట్లు కేటాయించింది. ఈ రైళ్లకు సంబంధించిన స్పెసిఫికేషన్లను రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ అభివృద్ధి చేసిందని, ఈ సాంకేతికత పూర్తిగా భారతదేశంలోనే తయారైందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవల పేర్కొన్నారు.  చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ప్రస్తుతం ఈ రైలును నిర్మిస్తోంది. ఈ రైలు తయారీ పూర్తయిన తర్వాత ఉత్తర రైల్వేకు సంబంధించిన ఢిల్లీ డివిజన్ ద్వారా జింద్-సోనిపట్ మార్గంలో దాదాపు 89 కి.మీ.ల దూరం నడుస్తుంది. 

డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ ర్యాక్‌పై హైడ్రోజన్ ఇంధన సెల్‌ను రెట్రోఫిట్ చేయడం ద్వారా పైలట్ ప్రాతిపదికన మొదటి హైడ్రోజన్ రైలు అభివృద్ధి కోసం భారత రైల్వేలు అత్యాధునిక ప్రాజెక్టును చేపట్టాయని రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ అన్నారు. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఈ రైలుకు సంబంధించిన స్పెసిఫికేషన్లను రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ తయారు చేసింది. ఇది ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత పొడవైన హైడ్రోజన్ రైలుగా ఉండనుంది. ఇది ప్రపంచంలోనే అత్యధిక శక్తితో నడిచే హైడ్రోజన్ రైళ్లలో ఒకటిగా కూడా ఉంటుందని ఆయన అన్నారు. ఈ హైడ్రోజన్ రైలు అద్భుతమైన 1,200 హార్స్‌పవర్‌తో నడుస్తుంది. ఇతర దేశాలలో నడుస్తున్న ఇలాంటి హైడ్రోజన్ రైళ్ల బలం కంటే రెట్టింపు కంటే ఎక్కువ అని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హైడ్రోజన్-శక్తితో నడిచే రైళ్లలో చాలా వరకు 500 నుంచి 600 హెచ్‌పీ మధ్య సామర్థ్యం కలిగిన ఇంజిన్‌లను కలిగి ఉంటాయి. కానీ భారతదేశంలో అభివృద్ధి చేసిన హైడ్రోజన్ రైలు వాటన్నింటినీ అధిగమిస్తుంది.

ఈ రైలు ఇంధన కణాలను ఉపయోగించి నడుస్తుంది. ఇవి హైడ్రోజన్, ఆక్సిజన్‌లను కలపడం ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి. ఉప ఉత్పత్తిగా నీటి ఆవిరిని మాత్రమే విడుదల చేస్తాయి. ఈ రైలుతో పాటు హైడ్రోజన్‌ను రీఫిల్ చేయడానికి ఏకకాలంలో ఆన్-గ్రౌండ్ మౌలిక సదుపాయాలను ఇంటిగ్రేటెడ్ హైడ్రోజన్ ఉత్పత్తి-నిల్వ-పంపిణీ సౌకర్యాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రత్యామ్నాయ ఇంధన ఆధారిత రైలు ప్రయాణంలో పురోగతి సాధించడంపై భారత రైల్వేల నిబద్ధతను ఈ ప్రాజెక్ట్ మరింతగా నిర్ధారిస్తుందని నిపుణులు చెబుతున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి