భారీ విద్యుత్ టవర్లు సాగు భూమిలో ఏర్పాటు చేస్తే.. రైతుకు నష్టపరిహారం వస్తుందా?

సాగు భూమిలో భారీ విద్యుత్ ట్రాన్స్‌మిషన్ టవర్ ఏర్పాటు చేస్తే రైతులకు పరిహారం లభించే అవకాశం ఉంది. టవర్ బేస్, విద్యుత్ లైన్ వెళ్లే RoW కారిడార్, పంటలు, చెట్ల నష్టాన్ని బట్టి పరిహారం నిర్ణయిస్తారు. ఇది సాధారణంగా నెలవారీ అద్దె కాదు. కేంద్ర మార్గదర్శకాలు, రాష్ట్ర నిబంధనల ప్రకారం చెల్లింపులు మారవచ్చు.

భారీ విద్యుత్ టవర్లు సాగు భూమిలో ఏర్పాటు చేస్తే.. రైతుకు నష్టపరిహారం వస్తుందా?
Power Grid Towers

Updated on: Aug 21, 2026 | 5:37 PM

చాలా చోట్లా భారీ విద్యుత్ టవర్లు చూసే ఉంటారు కదా. కొన్ని ప్రాంతాల్లో పొలాల్లో కూడా ఇలాంటి భారీ ఎత్తైన విద్యుత్ టవర్లు కనిపిస్తూ ఉంటాయి. రైతులు సాగు చేసే వ్యవసాయ భూమిలో వీటిని ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరాను కొనసాగిస్తారు. అయితే రైతుల పొలాల్లో ఇలాంటి భారీ విద్యుత్ ట్రాన్స్‌మిషన్ టవర్లు నిర్మించినప్పుడు రైతులకు పరిహారం చెల్లించే నిబంధనలు ఉన్నాయి. అయితే ఇది సాధారణంగా నెలనెలా అద్దె రూపంలో ఉండదు. టవర్ ఎక్కడ పడింది, విద్యుత్ లైన్ కింద ఎంత భూమి ప్రభావితమైంది, పంటలు/చెట్లు దెబ్బతిన్నాయా వంటి అంశాల ఆధారంగా పరిహారం ఉంటుంది.

ఈ టవర్లను ఎవరు నిర్మిస్తారు?

ఇలాంటి భారీ టవర్లు సాధారణంగా పవర్ ట్రాన్స్‌మిషన్ సంస్థలు నిర్మిస్తాయి. దేశవ్యాప్తంగా పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు, రాష్ట్ర ట్రాన్స్‌మిషన్ యుటిలిటీస్, అలాగే కొన్ని ప్రైవేట్ ట్రాన్స్‌మిషన్ సర్వీస్ ప్రోవైడర్స్ ప్రాజెక్టులను అమలు చేస్తాయి. తెలంగాణలో రాష్ట్ర స్థాయిలో TGTRANSCO ట్రాన్స్‌మిషన్ నెట్‌వర్క్‌ను ప్లాన్ చేసి, నిర్మించి, నిర్వహిస్తుంది.

రైతు భూమిలో టవర్ పెడితే భూమిని పూర్తిగా తీసుకుంటారా?

సాధారణంగా టవర్ వచ్చినంత మాత్రాన రైతు మొత్తం భూమిని ప్రభుత్వం కొనుగోలు చేయడం తప్పనిసరి కాదు. Right of Way (RoW) హక్కు ద్వారా లైన్ వేయడానికి, టవర్ నిర్మించడానికి అవసరమైన హక్కులు కల్పిస్తారు. టవర్ కాళ్లు ఉన్న ప్రాంతంలో భూమి వినియోగంపై తీవ్రమైన పరిమితులు ఉంటాయి. లైన్ వెళ్లే కారిడార్‌లో కూడా కొన్ని నిర్మాణాలు, ఎత్తైన చెట్ల పెంపకం వంటి వాటిపై పరిమితులు ఉండవచ్చు.

టవర్ కింద ఉన్న భూమికి ఎంత పరిహారం?

కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ 2024లో సవరించిన RoW పరిహార మార్గదర్శకాల్లో టవర్ బేస్ ప్రాంతానికి భూమి విలువలో 200 శాతం వరకు పరిహారం, RoW కారిడార్‌కు 30 శాతం వరకు పరిహారం నిర్దేశించింది. అయితే రాష్ట్రాలు తమ పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేయవచ్చు. 2025లో వచ్చిన అదనపు మార్గదర్శకాల ప్రకారం కొన్ని ప్రాంతాల్లో RoW పరిహారం భూమి మార్కెట్ విలువ ఆధారంగా నిర్ణయించే విధానం కూడా తీసుకొచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో ISTS లైన్ల RoW కారిడార్‌కు 30 శాతం, మున్సిపల్ కార్పొరేషన్/మెట్రోపాలిటన్ ప్రాంతాల్లో 60 శాతం, ఇతర పట్టణ ప్రాంతాల్లో 45 శాతం వరకు నిబంధనలు ఉన్నాయి. అయితే ప్రతి రాష్ట్రంలో, ప్రతి ప్రాజెక్టులో ఒకే విధంగా చెల్లించరు. కేంద్ర మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా లేదా సవరించి అమలు చేయవచ్చు. 2026లో కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ కూడా రాష్ట్రాల విధానాల ప్రకారమే పరిహారం అమలు అవుతుందని స్పష్టం చేసింది.

పంటలు, చెట్లు నష్టపోతే?

టవర్ నిర్మాణ సమయంలో పంటలు నష్టపోయినా, చెట్లు తొలగించినా ఆ నష్టానికి ప్రత్యేక పరిహారం ఉంటుంది. ఇది టవర్/RoW పరిహారానికి అదనంగా ఉండవచ్చు. సాధారణంగా ఈ నష్టపరిహారాన్ని నెలవారీ అద్దెగా చెల్లించరు. ఇది ఇంటి స్థలాన్ని లీజుకు ఇచ్చినట్లుగా ఉండదు. ప్రధానంగా ఒకేసారి RoW/టవర్ పరిహారం, పంటలు లేదా చెట్లకు నష్టం జరిగితే దానికి సంబంధించిన పరిహారం చెల్లిస్తారు. అందువల్ల రైతుకు టవర్ మా పొలంలో ఉంది కాబట్టి జీవితాంతం ప్రతి నెల అద్దె వస్తుంది అనుకోవడం సరైనది కాదు.

తెలంగాణలో పరిస్థితి ఎలా ఉంది?

తెలంగాణలో కూడా టవర్ లైన్ల వల్ల రైతుల భూమి విలువ తగ్గడం, పంట నష్టం వంటి అంశాలపై పరిహారం విషయంలో కేసులు నమోదయ్యాయి. తెలంగాణ విద్యుత్ నియంత్రణ సంస్థ పాత కేసుల్లో టవర్ ప్రాంతం, లైన్ కారిడార్, పంట నష్టాలకు సంబంధించిన పరిహార వివాదాలను పరిశీలించింది.

Loading...
Unable to load recommendations.
Follow Us