
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం దేశవ్యాప్తంగా మధ్యతరగతి, తక్కువ ఆదాయ కుటుంబాల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ పథకం కింద ఇంటి పైకప్పుపై రూఫ్టాప్ సోలార్ వ్యవస్థలు ఏర్పాటు చేసుకునే వారికి కేంద్రం భారీ సబ్సిడీ అందిస్తోంది. ప్రతి నెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను అందించడం ఈ పథక ముఖ్య లక్ష్యం. ప్రధాని నరేంద్ర మోదీ 2024 జనవరి 22న ఈ పథకాన్ని ప్రకటించారు. దీని ద్వారా దేశవ్యాప్తంగా సుమారు కోటి కుటుంబాలకు రూఫ్టాప్ సోలార్ వ్యవస్థలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
ప్రస్తుతం భారతదేశంలో రూఫ్టాప్ సోలార్ వ్యవస్థల ఖర్చు ప్రతి కిలోవాట్కు సుమారు రూ.60,000 నుంచి రూ.80,000 మధ్య ఉంటోంది. అంటే 3 కిలోవాట్ల సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేయాలంటే సుమారు రూ.1.8 లక్షల వరకు ఖర్చవుతుంది. అయితే కేంద్ర సబ్సిడీ రూ.78,000 తీసివేస్తే, వినియోగదారుడు స్వయంగా భరించాల్సిన మొత్తం సుమారు రూ.1.08 లక్షలకు తగ్గుతుంది. కొన్ని రాష్ట్రాల్లో అదనపు రాష్ట్ర సబ్సిడీలు కూడా లభిస్తున్నాయి. ఉదాహరణకు ఉత్తర్ప్రదేశ్లో అదనంగా రూ.30,000 వరకు రాష్ట్ర సబ్సిడీ అందిస్తున్నారు.
ఒక 3 కిలోవాట్ల సోలార్ వ్యవస్థ సాధారణంగా నెలకు 250 నుంచి 300 యూనిట్ల వరకు విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. సగటున 275 యూనిట్లు ఉత్పత్తి అవుతాయని భావిస్తే, యూనిట్కు రూ.8 చొప్పున నెలకు దాదాపు రూ.2,200 వరకు ఆదా అవుతుంది. అంటే సంవత్సరానికి సుమారు రూ.26,400 వరకు విద్యుత్ బిల్లు తగ్గే అవకాశం ఉంటుంది. ఈ లెక్కన రూ.1.08 లక్షల పెట్టుబడి సుమారు 4 సంవత్సరాల వ్యవధిలో తిరిగి వస్తుంది. రాష్ట్ర సబ్సిడీ కూడా లభిస్తే ఈ కాలం 3 సంవత్సరాల వరకు తగ్గే అవకాశం ఉంది.
సాధారణంగా రూఫ్టాప్ సోలార్ వ్యవస్థలు 25 సంవత్సరాల వరకు పనిచేస్తాయి. అంటే పెట్టుబడి తిరిగి వచ్చిన తర్వాత దాదాపు రెండు దశాబ్దాల పాటు తక్కువ విద్యుత్ బిల్లుల ప్రయోజనం పొందవచ్చు. నెట్ మీటరింగ్ సదుపాయం ద్వారా మిగిలిన విద్యుత్ను గ్రిడ్కు విక్రయించే అవకాశం కూడా ఉంటుంది. దీంతో విద్యుత్ ఖర్చు మరింత తగ్గుతుంది. ముందస్తు ఖర్చు భారం తగ్గించేందుకు ప్రభుత్వం పూచీకత్తు లేని సోలార్ రుణాలను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి