
రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పీఎం కిసాన్ సాయం మార్చి 13వ తేదీన అందనుంది. శుక్రవారం అసోంలోని గువహతిలో జరిగే కార్యక్రమంలో ఈ డబ్బులను ప్రధాని నరేంద్ర మోదీ తన చేతుల మీదుగా విడుదల చేయనున్నారు. డబ్బులు విడుదల చేసిన అనంతరం రైతులతో ముచ్చటించడంతో పాటు సభలో మోదీ ప్రసంగించనున్నారు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు మోదీ డబ్బులను విడుదల చేయనున్నారు. దీంతో సాయంత్రానికి రైతుల అకౌంట్లలో రూ.2 వేలు జమ కానున్నాయి. అయితే మోదీ నిధులు విడుదల చేస్తున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం లబ్దిదారుల మొబైల్కు ఓ మెస్సేజ్ పంపుతోంది. కేంద్ర వ్యవసాయశాఖ నుంచి ఈ మెస్సేజ్లు వస్తున్నాయి.
“ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 13న సాయంత్రం 5 గంటలకు పీఎం కిసాన్ 22వ విడత సొమ్మును అస్సాంలోని గౌహతి వేదికగా విడుదల చేయాలని నిర్ణయించారు. https://pmindiawebcast.nic.in/ లింకు ఓపెన్ చేసి వెబ్కాస్ట్ ద్వారా మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనండి. అందరూ పాల్గొనాలని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మీ శివరాజ్ సింగ్ చౌహన్, కేంద్ర కేబినెట్ మంత్రి వ్యవసాయం, రైతు సంక్షేమ మంత్రిత్వశాఖ” అంటూ లబ్దిదారుల మొబైల్స్కు ఎస్ఎంఎస్లు వస్తున్నాయి. అయితే ఈ లింక్ ద్వారా లబ్దిదారులతో ప్రధాని మోదీ వర్చువల్గా మాట్లాడనున్నారు. కొంతమంది రైతులతో మోదీ నేరుగా మాట్లాడి తమ సమస్యలను తెలుసుకోనున్నారు. మోదీతో తమ సమస్యలతో చెప్పుకునే అవకాశం కేంద్రం ఈ విధానంలో కల్పిస్తోంది. అందుకే లబ్దిదారులకు సమాచారం ఇస్తూ ఈ మెస్సేజ్లు పంపుతోంది.
దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ ద్వారా 2.15 కోట్ల మంది మహిళా రైతులు లబ్ది పొందుతున్నారు. గత ఏడాది నవంబర్లో కేంద్రం 21వ విడత నిధులను తమిళనాడు వేదికగా విడుదల చేసింది. ప్రతీ ఏడాది రూ.9.32 కోట్ల మంది రైతులకు అందిస్తుండగా.. ఇందుకు రూ.18,640 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ప్రతీ ఏడాది రూ.6 వేల చొప్పున మూడు విడతలుగా అందిస్తోంది. ఈ ఏడాదికి సంబంధించి తొలి విడత నిధులను ఇవాళ విడుదల చేస్తోంది. ప్రతీ ఏడాది తొలి విడత సొమ్మును ఫిబ్రవరిలో జమ చేసేవారు. కానీ ఈ సారి పలు కారణాల వల్ల జాప్యం జరిగింది. పీఎం కిసాన్ లబ్దిదారుల రీవెరిఫికేషన్ ప్రక్రియ కేంద్రం చేపట్టింది. ఇందులో భాగంగా ఈ సారి 1.30 లక్షల మంది అనర్హులను గుర్తించి వారిని లబ్దిదారుల జాబితా నుంచి తొలగించింది. ఈ ప్రక్రియ వల్లనే నిధుల విడుదలలో జాప్యం జరిగింది.