PM Kisan: రైతుల అకౌంట్‌లోకి రూ.2 వేలు? కేంద్రం నుంచి కీలక అప్డేట్‌

పీఎం-కిసాన్ 23వ విడత నిధులు జూన్-జూలై 2026 మధ్య విడుదలయ్యే అవకాశం ఉంది. అనేక మంది రైతుల ఖాతాల్లో డబ్బు జమ కాకపోవడానికి పత్రాల లోపాలు, ప్రక్రియలు పూర్తి చేయకపోవడమే కారణం. రైతులు తక్షణమే e-KYC, బ్యాంక్ ఖాతాకు ఆధార్ అనుసంధానం, భూమి ధృవీకరణ ప్రక్రియలను పూర్తి చేయాలి.

PM Kisan: రైతుల అకౌంట్‌లోకి రూ.2 వేలు? కేంద్రం నుంచి కీలక అప్డేట్‌
Pm Kisan 23rd Installment

Updated on: May 19, 2026 | 8:46 AM

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 23వ విడత కోసం ఎదురుచూస్తున్న కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు జారీ చేసింది. ఇప్పటికే 2026 మార్చి 13న అస్సాంలోని గౌహతి నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 22వ విడత నిధులను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ విడతలో దేశవ్యాప్తంగా 9.3 కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) ద్వారా ఒక్కొక్కరికి రూ.2,000 చొప్పున జమయ్యాయి. ఇప్పుడు రైతుల దృష్టి 23వ విడతపై నిలిచింది. ప్రభుత్వ విధానం ప్రకారం పీఎం-కిసాన్ పథకం కింద ప్రతి అర్హ రైతుకు సంవత్సరానికి మొత్తం రూ.6,000 ఆర్థిక సహాయం అందుతుంది.

ఈ మొత్తాన్ని మూడు విడతలుగా ఒక్కో విడతలో రూ.2,000 చొప్పున రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు. 22వ విడత మార్చిలో విడుదల కావడంతో, తదుపరి 23వ విడత జూన్-జూలై 2026 మధ్యలో విడుదలయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన అధికారిక తేదీని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఇంకా ప్రకటించలేదు. అయితే ప్రతి విడత సమయంలోనూ అనేక మంది రైతుల ఖాతాల్లో డబ్బు జమ కాకపోవడం సాధారణంగా కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం పత్రాలలో లోపాలు లేదా తప్పనిసరి ప్రక్రియలను పూర్తి చేయకపోవడమేనని అధికారులు చెబుతున్నారు. రైతులు ముందుగా తమ e-KYC ప్రక్రియను పూర్తి చేయాలని సూచిస్తున్నారు. ఇది సమీపంలోని CSC కేంద్రంలో బయోమెట్రిక్ ద్వారా లేదా ఇంటి నుంచే OTP ద్వారా పూర్తి చేసుకోవచ్చు.

అదేవిధంగా బ్యాంక్ ఖాతాను ఆధార్‌తో అనుసంధానం చేయడం తప్పనిసరి. ఎందుకంటే ప్రభుత్వం DBT విధానం ద్వారా నిధులను నేరుగా ఆధార్ లింక్ అయిన ఖాతాల్లోకి పంపిస్తోంది. అలాగే భూమి ధృవీకరణ ప్రక్రియ కూడా పూర్తి కావాలి. భూమి రికార్డులు ప్రభుత్వ డేటాబేస్‌లో సరిగ్గా నమోదై ఉండాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం ఈ పథకంలో పారదర్శకత పెంచేందుకు నిబంధనలను కఠినతరం చేసింది. 2019 ఫిబ్రవరి 1 తర్వాత వ్యవసాయ భూమి కొనుగోలు చేసిన వారు లేదా ఒకే కుటుంబంలో భార్యాభర్తలు వేర్వేరుగా లబ్ధి పొందుతున్నట్లు గుర్తిస్తే వారి చెల్లింపులను నిలిపివేస్తున్నారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us