
చాలామంది రిటైర్మెంట్ వయస్సు వరకు ఉద్యోగం చేయరు. మధ్యలోనే వివిధ కారణాలతో ఉద్యోగం మానేస్తూ ఉంటారు. భారత్లో రిటైర్మెంట్ వయస్సు 58 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 60 ఏళ్లుగా ఉండగా.. వివిధ సెక్టార్లు ,రాష్ట్రాలు, పనిచేసే ఉద్యోగాన్ని బట్టి రిటైర్మెంట్ వయస్సులో వ్యత్యాసాలు ఉన్నాయి. అయితే కొంతమంది 40 ఏళ్ల వయస్సులోనే ఉద్యోగం మానేస్తుంటారు. అలాంటివారు పీఎఫ్ అకౌంట్ కలిగి ఉంటే వారి బ్యాలెన్స్పై వడ్డీ కొనసాగుతుందా? అనే ప్రశ్నలు వస్తుంటాయి. అయితే పీఎఫ్ నిబంధనలను పరిశీలిస్తే ఇందుకు స్పష్టమైన సమాధానాలు లభిస్తాయి. పీఎఫ్ మార్గదర్శకాల ప్రకారం ఉద్యోగం మానేసిన వెంటనే పీఎఫ్ వడ్డీ అనేది ఆగిపోదు. ఇందుకు కొన్ని షరతులు ఉన్నాయి. అవేంటి అనేది చూద్దాం.
మీరు 40 ఏళ్ల వయస్సులో ఉద్యోగం మానేసినా 58 ఏళ్ల వయస్సు వరకు పీఎఫ్ బ్యాలెన్స్పై వడ్డీ అనేది పొందవచ్చు. మీ అకౌంట్లోని పొదుపును మీరు విత్ డ్రా చేసుకోకపోతే అర్హత ప్రకారం 58 ఏళ్ల వరకు వడ్డీ అనేది జమ అవుతూ ఉంటుంది. మీరు ఉద్యోగం మానేసినా మీ పీఎఫ్ సొమ్ముపై వడ్డీ వస్తూనే ఉంటుంది. అంటే మీరు 40 ఏళ్ల వయస్సులో ఉద్యోగం మానేసినా తర్వాతి 18 ఏళ్ల వరకు కూడా వడ్డీ రూపంలో ఆదాయం పొందవచ్చు. 58 ఏళ్ల తర్వాత మీ అకౌంట్ ఇనాక్టివ్గా మారవచ్చు. ప్రస్తుతం పీఎఫ్ వడ్డీ రేటు 8.25 శాతం ఉంటుంది. భవిష్యత్తులో దీనిని పెంచవచ్చు.. లేదా తగ్గించవచ్చు. ఈపీఎఫ్ఓ ప్రతీ ఆర్ధిక సంవత్సరంలో చివరిలో వడ్డీ రేట్లను ప్రకటిస్తూ ఉంటుంది. గత మూడేళ్లుగా పీఎఫ్ వడ్డీ రేట్లు స్ధిరంగా కొనసాగుతున్నాయి. బ్యాంక్ ఫిక్స్ డ్ డిపాజిట్ల కంటే ఇది ఎక్కువే అని చెప్పవచ్చు. నెలవారీ పీఎఫ్ బ్యాలెన్స్ ఆధారంగా వడ్డీని లెక్కిస్తారు. ఆర్ధిక సంవత్సరం పూర్తయిన తర్వాత వీటిని లెక్కించి ఒకేసారి అకౌంట్లో జమ చేస్తారు.
40 ఏళ్ల వయస్సులో ఉద్యోగం మానేస్తే తొందరపడి పీఎఫ్ బ్యాలెన్స్ విత్ డ్రా చేసుకోవచ్చు. ఒకసారి ఆలోచించుకోవడం ముఖ్యం. మీరు ఒకవేళ వేరే ఉద్యోగంలో చేరితే పీఎఫ్ ఖాతాను బదిలీ చేసుకోవచ్చు. దీని వల్ల మీకు దీర్ఘకాలికంగా పొదుపు ఉంటుంది. పీఎఫ్ అకౌంట్ను పాత కంపెనీ నుంచి కొత్త కంపెనీలోకి మార్చడం వల్ల రెండు అకౌంట్లను నిర్వహించుకునే శ్రమ తగ్గుతుంది. నిధులన్నీ ఒకే అకౌంట్లో ఉండటం వల్ల కన్ప్యూజన్ కూడా ఉండదు. దీంతో కంపెనీలు మారినప్పుడు మీ పీఎఫ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుత విధానంలో ఆటోమేటిక్గా అకౌంట్ బదిలీ అయ్యే ఫీచర్ను ఈపీఎఫ్ఓ ప్రవేశపెట్టింది.