
ఉద్యోగానికి రిటైర్మెంట్ ప్రకటించినవారికి అతిపెద్ద ఆందోళన ఒకటి ఉంటుంది. అదే స్థిరమైన ఆదాయం. ఉద్యోగం చేసే సమయంలో నెలనెలా జీతం రూపంలో ఫిక్స్ డ్ ఇన్కమ్ ఉంటుంది. అదే రిటైర్మెంట్ తీసుకున్నాక నెలనెలా ఖర్చుల కోసం ఇలాంటి స్థిరమైన ఆదాయం ఉండదు. అయితే రిటైర్మెంట్ తర్వాత కూడా నెలనెలా ఫిక్స్ డ్ ఇన్కమ్ అనేది పొందవచ్చు. ఇందుకోసం ఉన్న మార్గాల్లో ఒకటి సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్(SCSS). కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఈ పథకంతో నెలనెలా డబ్బులు పొందవచ్చు. అదెలా అనేది చూస్తే..
సీనియర్ సిటిజన్ల సేవింగ్స్ స్కీమ్ను పోస్టాఫీసులు లేదా బ్యాంకుల ద్వారా ఓపెన్ చేయవచ్చు. అత్యధిక వడ్డీ రేటులో ఇందులో పొందవచ్చు. ప్రస్తుతం వార్షిక వడ్డీ రేటు 8.2 శాతంగా ఉంంది. ప్రతీ త్రైమాసికానికి కేంద్రం వడ్డీ రేటును ప్రకటిస్తూ ఉంటుంది. ఒక ఇందులో పెట్టుబడి పెడితే సురక్షితంగా ఉంటుంది. స్టాక్ మార్కెట్లలోని ఒడిదొడుకుల వల్ల ఎలాంటి ప్రభావం ఉండదు.
ఇక నెలకు రూ.20 వేల ఆదాయం ఈ పథకం ద్వారా పొందవచ్చు. ఉదాహరణకు ఎవరైనా ఈ స్కీమ్లో రూ.30 లక్షలు పెట్టుబడి పెడితే.. 8.2 శాతం వార్షిక వడ్డీ రేటు ప్రకారం లెక్క వేస్తే వార్షిక వడ్డీ రూ.2.46 లక్షలు వస్తుంది. మూడు నెలలకు ఒకసారి ఈ పథకంలో వడ్డీ చెల్లిస్తారు. దీంతో ప్రతీ త్రైమాసికంలో రూ.61,500 పెట్టుబడిదారులు అందుకుంటారు. అంటే నెలకు రూ.20,500 మీ అకౌంట్లోకి వస్తున్నట్లు.
ఈ పథకంలో కేవలం సీనియర్ సిటిజన్లు మాత్రమే పెట్టుబడి పెట్టడానికి అర్హులు. వయస్సు 60 ఏళ్లు లేదా అంతకంటే పైన ఉండాలి. ఈ వయస్సు ఉన్నవారిలో ఎవరైనా సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ ఖాతా తెరవొచ్చు. ముందుగా పదవీ విరమణ చేసినవారు కూడా ఇందులో చేరవచ్చు. 55 ఏళ్ల వయస్సు నుంచే కొన్ని పథకాల ద్వారా అకౌంట్ తెరవొచ్చు. ఇక భార్యతో కలిసి జాయింట్ అకౌంట్ కూడా తెరవొచ్చు.
ఇక ఇందులో పెట్టుబడి పెడితే ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద మినహాయింపులు లభిస్తాయి. ఒక ఆర్ధిక సంవత్సరంలో మీరు పెట్టిన పెట్టుబడిలో రూ.1.5 లక్షల వరకు ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది. ఈ పథకానికి ఐదేళ్ల లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. ఐదేళ్ల తర్వాత మరో మూడేళ్ల పాటు కూడా పొడిగించుకోవచ్చు. ఇలా ఎనిమిదేళ్ల వరకు ఖాతా నిర్వహించుకోవచ్చు.