
గత నెల రోజులుగా ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ షేర్లు స్టాక్ మార్కెట్లో అసాధారణ రీతిలో దూసుకుపోతున్నాయి. కేవలం 30 రోజుల్లోనే ఈ స్టాక్ దాదాపు 74 శాతం పెరిగి పెట్టుబడిదారులకు భారీ లాభాలను అందించింది. అలాగే 52 వారాల కనిష్ట స్థాయి రూ.22.25తో పోలిస్తే ఇప్పటివరకు సుమారు 82 శాతం రికవరీ సాధించడం గమనార్హం. ఈ వేగవంతమైన ర్యాలీతో ఇన్వెస్టర్లలో ఒక కీలక సందేహం నెలకొంది, ఇప్పుడే లాభాలను బుక్ చేసుకోవాలా, లేక దీర్ఘకాలికంగా కొనసాగించాలా? అనే డౌట్ పెట్టుబడిదారుల్లో ఉంది.
ఈ అనూహ్య పెరుగుదల నేపథ్యంలో మార్కెట్ నియంత్రణ సంస్థలు కూడా అప్రమత్తమయ్యాయి. BSE, NSE ఈ స్టాక్ను స్వల్పకాలిక అడిషనల్ సర్వేఇల్లాన్స్ మెస్సురే (ASM) జాబితాలో చేర్చాయి. అంటే ఈ షేరులో అధిక అస్థిరత ఉన్నందున పెట్టుబడిదారులు జాగ్రత్తగా వ్యవహరించాలనే సంకేతం. కంపెనీ వ్యాపార పరంగా చూస్తే ఓలా ఎలక్ట్రిక్ కేవలం స్కూటర్ల విక్రయాలకే పరిమితం కాకుండా, తన స్వంత బ్యాటరీ టెక్నాలజీపై భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఇటీవల విడుదల చేసిన S1 X+ 5.2 kWh మోడల్లో ఉపయోగించిన 4680 భారత్ సెల్స్, అలాగే కంపెనీ అభివృద్ధి చేస్తున్న లిథియం ఐరన్ ఫాస్ఫేట్ (LFP) టెక్నాలజీ మార్కెట్లో మంచి స్పందనను తెచ్చాయి. ఈ కొత్త బ్యాటరీలు తక్కువ ఖర్చుతో ఎక్కువ సామర్థ్యాన్ని అందించే అవకాశముండటంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను బలపరిచాయి.
అయితే నిపుణులు మాత్రం కొంత జాగ్రత్త అవసరమని హెచ్చరిస్తున్నారు. కంపెనీ భవిష్యత్తు దాని ఆర్థిక ఫలితాలు, అమ్మకాల తర్వాత సేవలపై ఆధారపడి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. వినియోగదారుల సంతృప్తి, సర్వీస్ నాణ్యత వంటి అంశాలు దీర్ఘకాలిక విజయానికి కీలకం కానున్నాయి. టెక్నికల్ పరంగా, స్టాక్ రూ.42 స్థాయిని దాటి నిలదొక్కుకుంటే, రూ.50 వరకు వెళ్లే అవకాశముంది. కానీ లాభాల స్వీకరణ పెరిగితే, రూ.35 తరువాత రూ.32 స్థాయిల వద్ద మద్దతు లభించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ షేరు రూ.40.82 వద్ద ట్రేడ్ అవుతుండగా, పెట్టుబడిదారులు వేగంగా నిర్ణయాలు తీసుకునే ముందు రిస్క్ను జాగ్రత్తగా అంచనా వేయడం అవసరం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి