పెట్రోల్‌, డీజిల్‌ వాహనాలపై కేంద్ర మంత్రి సంచలన స్టేట్‌మెంట్‌! ఇక వాటికి..

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ భారత ఆటోమొబైల్ భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు. దీర్ఘకాలంలో పెట్రోల్, డీజిల్ వాహనాలకు స్థానం ఉండదని, స్వచ్ఛ ఇంధనాలైన ఈవీలు, హైడ్రోజన్, బయోఫ్యూయల్సే ప్రధానం అవుతాయన్నారు. ఇథనాల్ ఆధారిత ఫ్లెక్స్-ఫ్యూయల్ టెక్నాలజీ, బస్సుల భద్రత పెంపుపై దృష్టి సారించారు.

పెట్రోల్‌, డీజిల్‌ వాహనాలపై కేంద్ర మంత్రి సంచలన స్టేట్‌మెంట్‌! ఇక వాటికి..
Nitin Gadkari

Updated on: Apr 29, 2026 | 10:01 AM

కేంద్ర రహదారుల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కారీ చేసిన తాజా వ్యాఖ్యలు దేశంలో ఆటోమొబైల్ రంగ భవిష్యత్తుపై పెద్ద చర్చకు దారితీశాయి. మంగళవారం జరిగిన బవర్ల్ద్ ఇండియా కాంక్లేవ్ 2025లో మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్ వాహనాలకు దీర్ఘకాలంలో స్థానం ఉండదని ఆయన స్పష్టం చేశారు. పెరుగుతున్న దిగుమతులు, పర్యావరణ సమస్యలు ఈ మార్పుకు ప్రధాన కారణాలని ఆయన వివరించారు. గడ్కరీ ప్రకారం భవిష్యత్తు పూర్తిగా స్వచ్ఛమైన ఇంధనాలదే. బయోఫ్యూయల్స్, సిఎన్‌జి, ఎల్‌ఎన్‌జి, ఎలక్ట్రిక్ వాహనాలు, ముఖ్యంగా హైడ్రోజన్ వంటి ప్రత్యామ్నాయాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని ఆయన చెప్పారు. ఇప్పటికే టాటా మోటార్స్, వోల్వో, అశోక్ లేలాండ్, మహీంద్రా అండ్‌ మహీంద్రా వంటి ప్రముఖ సంస్థలు హైడ్రోజన్ వాహనాలపై ప్రయోగాలు ప్రారంభించాయి. దేశంలో 10 మార్గాల్లో హైడ్రోజన్ బస్సులు, ట్రక్కులు నడుస్తుండటం ఈ దిశగా ముఖ్య అడుగు.

ఇథనాల్ ఆధారిత ఫ్లెక్స్-ఫ్యూయల్ టెక్నాలజీ కూడా కీలక పాత్ర పోషించనుంది. భారత్‌లో వ్యవసాయ అవశేషాల నుంచి ఇథనాల్ తయారీకి ఉన్న సామర్థ్యాన్ని ఉపయోగించుకుంటే, ఇంధన దిగుమతులపై ఆధారపడకూడదనే లక్ష్యానికి ఇది తోడ్పడుతుంది. ఇప్పటికే E20 ఇంధనం వినియోగం ప్రారంభమైందని, భవిష్యత్తులో ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాలు సాధారణం అవుతాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇక ప్రజా రవాణాలో భద్రతపై కూడా మంత్రి ప్రత్యేకంగా దృష్టి సారించారు. బస్సుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను కఠినతరం చేస్తూ, భౌతిక, వీడియో ధృవీకరణను తప్పనిసరి చేయాలని నిర్ణయించారు. స్వీయ ధృవీకరణ విధానాన్ని తొలగించడం ద్వారా నాణ్యత, భద్రత మెరుగవుతుందని భావిస్తున్నారు. మొత్తంగా ఈ ప్రకటనలు భారత ఆటోమొబైల్ రంగంలో భారీ మార్పులకు సంకేతాలు ఇస్తున్నాయి. రాబోయే మూడేళ్లలో ఎలక్ట్రిక్ బస్సుల డిమాండ్ 1.5 లక్షల యూనిట్లకు చేరే అవకాశం ఉండగా, ప్రస్తుత తయారీ సామర్థ్యం దానికి సరిపోని పరిస్థితి ఉంది. దీంతో పరిశ్రమ వేగంగా విస్తరించాల్సిన అవసరం ఏర్పడింది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us