
ఇవాల్టి(ఏప్రిల్ 1) నుంచి కొత్త ఐటీ రూల్స్ అమల్లోకి వచ్చాయి. ఏడాదికి రూ.12 లక్షల ఆదాయం ఉన్నవారికి, ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ఇచ్చారు. ఉద్యోగులు రూ.75,000 స్టాండర్డ్ డిడక్షన్ నుంచి ప్రయోజనం పొందుతారు. దీంఓతో పన్ను రహిత ఆదాయ పరిమితి రూ.12.75 లక్షలకు చేరింది. సెక్షన్ 87-ఎ కింద పన్ను మినహాయింపు రూ. 25 వేల నుంచి రూ.60 వేలకు పెరుగుతుంది. సీనియర్ సిటిజన్ల బ్యాంక్ ఎఫ్డీలపై వచ్చే వడ్డీ ఆదాయంపై TDS మినహాయింపు రూ 50,000 నుంచి లక్షకు పెరిగింది. 60 ఏళ్ల లోపు వ్యక్తులకు ఈ మొత్తాన్ని 40 వేల నుంచి 50,000కి పెంచారు. బ్యాంకుల నుంచి ఎడ్యుకేషన్ లోన్ తీసుకుని, ఆ మొత్తాన్ని విద్యార్థి ఫీజు కోసం విదేశాలకు పంపితే ఇకపై ఎలాంటి టీడీఎస్ ఉండదు. ఆప్డేటెడ్ ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ పరిమితిని 24 నుంచి 48 నెలలకు పెంచారు. గృహ అద్దె ఆదాయంపై మినహాయింపు 2.4 లక్షల నుంచి రూ. 6 లక్షలకు పెరుగుతుంది. వార్షిక ప్రీమియం రూ.2.5 లక్షలకు మించిన యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ నుంచి ఉపసంహరణలు.. మూలధన లాభాల్లోకి వస్తాయి.
90 రోజులకు పైగా ఇన్యాక్టివ్గా ఉన్న మొబైల్ నంబర్లకు ఇవాల్టి నుంచి యూపీఐ సేవలు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు బ్యాంకులు, పేమెంట్ సేవలందించే ప్రొవైడర్లకు.. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆదేశాలు జారీ చేసింది. యూపీఐ లైట్ వ్యాలెట్లో డిపాజిట్ చేసిన నగదును మళ్లీ బ్యాంక్ అకౌంట్కు పంపించే సదుపాయం కూడా నేటి నుంచే అందుబాటులోకి రానుంది. యూపీఐ లైట్ వినియోగించాలంటే ఇకపై యాప్ పిన్, పాస్కోడ్, బయోమెట్రిక్ ఉపయోగించాల్సి ఉంటుంది. ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఇవాల్టి నుంచి సేవింగ్స్ ఖాతాలకు మినిమం బ్యాలెన్స్ నిబంధనను అమల్లోకి తెచ్చాయి. నాన్ ఫైనాన్షియల్ ఏటీఎం లావాదేవీలకు చార్జీలు రూ.6 నుంచి రూ.7 వరకు పెరగవచ్చు. బ్యాంకు విధానాలు, ఉచిత లావాదేవీల పరిమితులను బట్టి నగదు ఉపసంహరణ ఛార్జీలు రూ.2 వరకు పెరిగే అవకాశం ఉంది. ఇక ఎడాపెడా లోన్లు తీసుకోవాలంటే కుదరదు. 3 కంటే ఎక్కువ బ్యాంకుల నుంచి రుణం తీసుకోవడానికి వీలు లేదు. ప్రస్తుతం మూడు కంటే ఎక్కువ సంస్థల్లో రుణాలు తీసుకుంటున్న 45 లక్షల మంది రుణ గ్రహీతలకు, ఇది మింగుడు పడడం కష్టం.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని..యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ కింద అమలు చేస్తారు. 25 సంవత్సరాల కంటే ఎక్కువ సర్వీస్ ఉన్న ఉద్యోగులు, గత 12 నెలల్లో వారి సగటు మూల వేతనంలో 50 శాతానికి సమానమైన పెన్షన్ పొందుతారు. ఇది సుమారు 23 లక్షల మందికి ప్రయోజనం చేకూరుస్తుంది. ఇవాల్టి నుంచి GST రూల్స్లో కూడా మార్పులు వచ్చాయి. రూ. 10 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న వ్యాపారులు 30 రోజుల్లోపు ఈ-ఇన్వాయిస్ పూర్తి చేయాలి. పాత GST వినియోగదారులు తమ వివరాలను నవీకరించాలి. రోజుకు రూ.7,500 కంటే ఎక్కువ రూమ్ టారిఫ్ ఉన్న హోటళ్లలోని రెస్టారెంట్లు 18% జీఎస్టీ పరిధిలోకి వస్తాయి.
మారుతి సుజుకి 4 శాతం, హ్యుందాయ్, మహీంద్రా, టాటా మోటార్స్, రెనాల్ట్, కియా వంటి కంపెనీలు 2 నుంచి 4 శాతం కార్ల రేట్లు పెంచుతున్నాయి. ఇక ఉత్తర్ప్రదేశ్లో ఇవాల్టి నుంచి స్టాంప్ పేపర్లు కనపడవు. ఈ-స్టాంప్ పేపర్లు అందుబాటులోకి వస్తాయి. యూపీలోని నోయిడా జిల్లాలో లిఫ్ట్ చట్టం అమల్లోకి వచ్చింది. ఏప్రిల్ 1 లోపు లిఫ్ట్ ఆపరేటర్లు తమ లిఫ్ట్లను తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలి. లేటుగా రిజిస్టర్ చేస్తే మొదటి 7 రోజులకు రోజుకు రూ.100 జరిమానా విధిస్తారు. 7 రోజుల తర్వాత ఇది రోజుకు రూ. 200కి పెరుగుతుంది.