
దేశంలో తక్కువ ఆదాయ కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించేందుకు మైక్రోఫైనాన్స్ రుణాలు కీలకంగా మారుతున్నాయి. సాధారణ బ్యాంకు రుణాలు పొందలేని వర్గాలకు ఈ రుణాలు ప్రత్యేకంగా ఉపయోగపడుతున్నాయని ఆర్థిక వర్గాలు చెబుతున్నాయి. తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలు చిన్న వ్యాపారం ప్రారంభించడానికి, అత్యవసర ఖర్చులు తీర్చడానికి, పిల్లల విద్యా ఫీజులు చెల్లించడానికి ఈ రుణాలను ఎక్కువగా వినియోగిస్తున్నాయి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిర్వచనం ప్రకారం.. మైక్రోఫైనాన్స్ రుణం అంటే ఎటువంటి పూచీకత్తు లేకుండా తక్కువ ఆదాయ కుటుంబాలకు ఇచ్చే చిన్న రుణం. వార్షిక ఆదాయం రూ.3 లక్షల వరకు ఉన్న కుటుంబాలు దీనికి అర్హులు. రుణానికి భూమి, ఇల్లు, బంగారం వంటి ఆస్తులను భద్రతగా పెట్టాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ సెక్యూరిటీ తీసుకుంటే అది మైక్రోఫైనాన్స్ కేటగిరీలోకి రాదు.
ఈ రుణాల పరిధిలో విద్యా రుణాలు, అత్యవసర అవసరాల రుణాలు, వ్యవసాయ రుణాలు, ఆదాయం పెంచే రుణాలు, వినియోగ వస్తువుల కొనుగోలు రుణాలు, చిన్న వ్యాపార రుణాలు వంటి విభాగాలు ఉంటాయి. సాధారణంగా రుణ పరిమితి రూ.10,000 నుంచి రూ.1.25 లక్షల వరకు ఉంటుంది. తిరిగి చెల్లింపు కాలం సాధారణంగా ఒకటి నుంచి మూడు సంవత్సరాల మధ్య ఉంటుంది.
వాయిదా చెల్లింపులో కూడా సౌలభ్యం కల్పించారు. వారానికోసారి లేదా నెలవారీగా చెల్లించే అవకాశం ఉంటుంది. అయితే మొత్తం ఇంటి ఆదాయంలో వాయిదా భారము 50 శాతం మించకూడదని ఆర్బీఐ స్పష్టం చేసింది. ముందస్తు చెల్లింపుపై ఎలాంటి జరిమానా లేకపోవడం మరో ప్రయోజనం. వడ్డీ రేట్లపై స్థిర పరిమితి లేకపోయినా, సంస్థలు అనవసరంగా అధిక వడ్డీ వసూలు చేయరాదని ఆర్బీఐ మార్గదర్శకాలు చెబుతున్నాయి. వడ్డీ నిర్ణయం సంస్థ బోర్డు ఆమోదించిన విధానం ప్రకారం నిధుల ఖర్చు, ప్రమాదం, నిర్వహణ వ్యయం ఆధారంగా నిర్ణయించాలి. బ్యాంకులు, చిన్న ఆర్థిక బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, NBFCలు, NBFC-MFIలు, సహకార బ్యాంకులు, స్వయం సహాయక బృందాలు, ఎన్జీఓలు వంటి ఆర్బీఐ నియంత్రిత సంస్థలు మాత్రమే ఈ రుణాలను అందించగలవని స్పష్టం చేసింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి