
LPG Crisis: దేశంలో ఎల్పీజీ (లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్) సరఫరాపై ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వినియోగదారులకు కీలక సూచనలు చేసింది. ఎల్పీజీ వినియోగాన్ని మితంగా ఉపయోగించుకోవాలని సూచిస్తూ, పైపుల ద్వారా సరఫరా అయ్యే సహజ వాయువు PNG వాడకాన్ని పెంచే దిశగా చర్యలు చేపడుతున్నట్టు తెలిపింది.
పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ మాట్లాడుతూ, ప్రస్తుతం గృహ వినియోగదారులకు PNG, అలాగే CNG సరఫరా పూర్తిగా కొనసాగుతోందని చెప్పారు. వాణిజ్య ఎల్పీజీ సరఫరా కూడా కొంతవరకు పునరుద్ధరించినట్లు తెలిపారు. ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని, వాణిజ్య ఎల్పీజీ వినియోగదారులు PNGకు మారితే మరింత ప్రయోజనం ఉంటుందని ఆమె పేర్కొన్నారు.
ప్రస్తుతం గ్లోబల్ సరఫరా ఒత్తిళ్లు, పెరుగుతున్న డిమాండ్ కారణంగా ముఖ్యంగా హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్ సేవల్లో ఎల్పీజీ కొరతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వాణిజ్య రంగం పీఎన్జీ వైపు మారితే గృహ వినియోగానికి ఎల్పీజీ సరఫరా సులభం అవుతుందని అధికారులు భావిస్తున్నారు. నగర ప్రాంతాల్లో PNG వినియోగాన్ని విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది.
పట్టణ ప్రాంతాలలో పీఎన్జీ వినియోగాన్ని మరింత విస్తృతం చేయడాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. వినియోగదారులు ఇమెయిల్, కస్టమర్ పోర్టల్స్, కాల్ సెంటర్లు వంటి పలు మార్గాల ద్వారా లేదా సంబంధిత సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (CGD) కంపెనీలను సంప్రదించడం ద్వారా PNG కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. CGD సంస్థలకు వినియోగదారులను ప్రోత్సహించాలని సూచించగా, కొందరు సంస్థలు ప్రత్యేక ఆఫర్లు కూడా అందిస్తున్నాయి. పీఎన్జీ నెట్వర్క్ విస్తరణ కోసం కేంద్రం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాసింది.
పైప్లైన్ ద్వారా అందే PNG, సిలిండర్లపై ఆధారపడే ఎల్పీజీతో పోలిస్తే స్థిరమైన సరఫరాను అందిస్తుంది. అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో ఇది మంచి ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు. మొత్తంగా గృహ వినియోగదారులకు ఎల్పీజీ సరఫరాను ప్రాధాన్యంగా కొనసాగిస్తూ, వాణిజ్య రంగంలో PNG వినియోగాన్ని పెంచడం ద్వారా డిమాండ్ను సమతుల్యం చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. సరఫరా అంతరాయాలు నివారించేందుకు ఈ మార్పు కీలకమని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
ఇది కూడా చదవండ: Mutual Fund: కేవలం రూ. 1 లక్ష పెట్టుబడి రూ.40 లక్షలుగా మారింది.. ఎలా.?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి