ముగిసిన లలితా జ్యువెలరీ IPO బిడ్డింగ్! షేర్ అలాట్మెంట్, లిస్టింగ్ ఎప్పుడంటే?

లలితా జ్యువెలరీ మార్ట్ IPOకు ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన లభించింది. ఆగస్టు 19న బిడ్డింగ్ ముగిసే సమయానికి ఇష్యూ 62.97 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. QIB విభాగం 145.38 రెట్లు, NII 73.89 రెట్లు, రిటైల్ 11.81 రెట్లు బుక్ అయ్యాయి. గ్రే మార్కెట్‌లో రూ.40 GMP నమోదైంది. ఆగస్టు 24న లిస్టింగ్ అయ్యే అవకాశం ఉంది.

ముగిసిన లలితా జ్యువెలరీ IPO బిడ్డింగ్! షేర్ అలాట్మెంట్, లిస్టింగ్ ఎప్పుడంటే?
Lalitha Jewellery Ipo

Updated on: Aug 19, 2026 | 8:32 PM

లలితా జువెల్లరీ మార్ట్‌ లిమిటెడ్‌ తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (IPO) ఆగస్టు 17న ప్రారంభమై బుధవారం ముగిసింది. ఈ IPOకు పెట్టుబడిదారుల నుంచి భారీ స్పందన లభించింది. మొత్తం 66.63 రెట్లు సబ్‌స్క్రిప్షన్‌ నమోదు కావడం విశేషంగా నిలిచింది. అంటే అందుబాటులో ఉన్న ప్రతి ఒక షేర్‌కు సగటున 66.63 రెట్ల మేర దరఖాస్తులు వచ్చాయి. కంపెనీ IPO విలువను గరిష్ఠ ధర ఆధారంగా చూస్తే దాదాపు రూ.1,700 కోట్లుగా ఉంది.

లలితా జువెల్లరీ మార్ట్‌ IPOలో ఒక్కో ఈక్విటీ షేర్‌ ధరను రూ.190 నుంచి రూ.201గా నిర్ణయించారు. ఒక్కో షేర్‌ ముఖ విలువ రూ.5. పెట్టుబడిదారులు కనీసం 74 షేర్లకు, ఆ తర్వాత 74 షేర్ల చొప్పున బిడ్లు వేయాల్సి వచ్చింది. దీంతో రిటైల్‌ ఇన్వెస్టర్లకు కనీస పెట్టుబడి రూ.14,874గా ఉంది.

ఈ పబ్లిక్‌ ఆఫర్‌లో రూ.1,200 కోట్ల వరకు ఫ్రెష్‌ ఇష్యూ ఉండగా, మరో రూ.500 కోట్ల వరకు ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (OFS) ఉంది. OFS ద్వారా ప్రమోటర్‌ ఎం. కిరణ్‌ కుమార్‌ జైన్‌ తన వాటాలో కొంత భాగాన్ని విక్రయిస్తున్నారు. ఫ్రెష్‌ ఇష్యూ ద్వారా సమీకరించే నిధులను ప్రధానంగా కొత్త స్టోర్ల ఏర్పాటు, వ్యాపార విస్తరణకు వినియోగించనున్నట్లు కంపెనీ వెల్లడించింది.

ప్రస్తుతం లలితా జువెల్లరీ మార్ట్‌ ‘లలితా’ బ్రాండ్‌ పేరుతో బంగారం, వెండి, వజ్రాభరణాలను విక్రయిస్తోంది. మార్చి 31, 2026 నాటికి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటకతో పాటు పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంలో 51 నగరాల్లో 61 స్టోర్లు నిర్వహిస్తోంది. దక్షిణ భారత మార్కెట్‌లో ప్రాంతీయ అభిరుచులకు అనుగుణంగా వివిధ రకాల ఆభరణాలను అందిస్తోంది.

కంపెనీ IPOలో అర్హత కలిగిన సంస్థాగత పెట్టుబడిదారులకు (QIB) నికర ఆఫర్‌లో గరిష్ఠంగా 50 శాతం వరకు, నాన్‌-ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లకు కనీసం 15 శాతం, రిటైల్‌ ఇన్వెస్టర్లకు కనీసం 35 శాతం కేటాయింపు ఉంటుంది. షేర్ల కేటాయింపు ఆగస్టు 20న, రీఫండ్‌ మరియు షేర్ల క్రెడిట్‌ ఆగస్టు 21న జరిగే అవకాశం ఉంది. NSE, BSEలో ఆగస్టు 24న లిస్టింగ్‌ కావాల్సి ఉంది.

అయితే IPOకు భారీ స్పందన వచ్చినప్పటికీ, షేర్లలో పెట్టుబడికి మార్కెట్‌ రిస్క్‌ ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. కంపెనీ భవిష్యత్‌ వృద్ధి, ఆర్థిక ఫలితాలు, విలువ, విస్తరణ ప్రణాళికలు, పరిశ్రమలో పోటీ వంటి అంశాలను పరిశీలించిన తర్వాతే పెట్టుబడి నిర్ణయం తీసుకోవడం మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us