
పెట్రోల్, డీజిల్ ధరలపై రిలయన్స్ సంస్థ శుభవార్త తెలిపింది. రిలయన్స్, బీపీ పీఎల్సీ సంయుక్తంగా జియో-బీపీ పేరుతో రిటైల్ పెట్రోల్ బంకులను దేశవ్యాప్తంగా నడుపుతున్న విషయం తెలిసిందే. దేశంలో రెండో అతిపెద్ద ప్రైవేట్ ఇంధన రిటైలర్ సంస్థగా ఇది ఉంది. అయితే అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంతో దేశంలో ప్రైవేట్ సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతున్నాయి. అయితే ప్రైవేట్ సంస్థ అయిన జియో-బీపీ వాహనదారులకు గుడ్ న్యూస్ తెలిపింది. పెట్రోల్ ధరలను పెంచేది లేదని, స్థిరంగా ఉంచుతామని ప్రకటించింది. ఇప్పటికే ప్రైవేట్ ఇంధన సంస్థలు ధరలను పెంచుతుండటంతో.. జియో-బీపీ సంస్థ కూడా పెంచుతుందనే వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఆ సంస్థ నుంచి ఈ ప్రకటన వచ్చింది.
ఇంధన ధరలను పెంచేందుకు ప్రస్తుతం తమ వద్ద ఎలాంటి ప్రణాళికలు లేవని జియో-బీపీ సంస్థ తెలిపింది. ముడి చమురు ధరలు పెరుగుతున్నా.. వినియోగదారులకు బదిలీ చేయబోమని స్పష్టం చేసింది. తాము దేశానికి అండగా నిలుస్తామని, కేంద్రం పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకం తగ్గించడం వల్ల ధరల పెంపు అవసరాన్ని కొంతమేర తగ్గించిందని పేర్కొంది. పశ్చిమాసియాలో యుద్దం కారణంగా అంతర్జాతీయంగా చమురు ధరలు బ్యారెల్కు 100 డాలర్లకుపైగా పెరిగాయని, అయినప్పటికీ ప్రభుత్వ పెట్రోలియం సంస్థల మాదిరిగానే తాము ధరలను పెంచకూడదని నిర్ణయించుకున్నట్లు జియో-బీపీ సంస్థ స్పష్టం చేసింది. అయితే దేశంలో అతిపెద్ద ప్రైవేట్ ఇంధన సంస్థ అయిన నయారా ఎనర్జీ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచింది. పెట్రోల్పై లీటర్కు రూ.5, డీజిల్పై రూ.3 పెంచింది. దేశంలో 6,967 బంక్లు ఆ సంస్థ కలిగి ఉంది. ఇక మరో ప్రైవేట్ సంస్థ అయిన షెల్ ఇండియా కూడా ధరలను పెంచింది.
ఇక దేశంలో మొత్తం 1,02,075 పెట్రోల్ పంపులు ఉండగా.. రిలయన్స్ 2185 బంక్లను కలిగి ఉంది. పెట్రోల్ అమ్మకాల్లో 4 శాతం, డీజిల్ అమ్మకాల్లో 6 శాతం మార్కెట్ వాటా కలిగి ఉంది. తమ బంకుల్లో అమ్మకాలపై ఎలాంటి పరిమితులు లేవని, తగినంత ఇంధన నిల్వలు ఉన్నాయని కంపెనీ వర్గాలు తెలిపాయి. సాధారణంగా తమ పెట్రోల్ బంక్లు పనిచేస్తున్నాయని పేర్కొంది. మార్చిలో పెట్రోల్ అమ్మకాలు 30 శాతం, డీజిల్ అమ్మకాలు 25 శాతం పెరిగాయని కంపెనీ తెలిపింది. మెరుగైన మైలేజ్ ఇచ్చే ఇంధనం సరఫరా చేస్తున్నందున ఇది సాధ్యమైందని పేర్కొంది.