
ప్రైవేట్ రంగ ఉద్యోగులకు పెద్ద ఉపశమనం కలిగించే మార్పు త్వరలో అమలులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త కార్మిక చట్టాల అమలుతో, ఉద్యోగులు వారానికి కేవలం నాలుగు రోజులు మాత్రమే పనిచేసి, వరుసగా మూడు రోజుల సెలవు పొందే అవకాశం ఉందని కార్మిక రంగ నిపుణులు చెబుతున్నారు. కార్పొరేట్ ప్రపంచంలో చాలా కాలంగా చర్చకు వచ్చిన ఈ విధానం ఇప్పుడు వాస్తవ రూపం దాల్చే దిశగా అడుగులు వేస్తోంది.
కొత్త నిబంధనల ప్రకారం వారానికి మొత్తం పని గంటలు 48 గంటలకు పరిమితం చేయబడతాయి. అయితే నాలుగు రోజుల పని విధానాన్ని ఎంచుకునే ఉద్యోగులు రోజుకు సుమారు 12 గంటలు పనిచేయాల్సి ఉంటుంది. ఇందులో విరామాలు, విశ్రాంతి సమయం కూడా ఉంటాయి. దీర్ఘకాలిక వారాంతపు సెలవులను కోరుకునే ఉద్యోగులకు ఇది ఆకర్షణీయమైన ఎంపికగా మారవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఈ విధానంలో ముఖ్యమైన అంశం ఏమిటంటే, దీన్ని ఉద్యోగులపై బలవంతంగా అమలు చేయలేరు. యాజమాన్యం, ఉద్యోగులు పరస్పర అంగీకారంతోనే ఈ విధానం అమల్లోకి వస్తుంది.
అలాగే ఓవర్టైమ్ నిబంధనలను కూడా కఠినతరం చేశారు. వారానికి 48 గంటలకు మించి పని చేయిస్తే, కంపెనీలు సాధారణ వేతనానికి రెట్టింపు చెల్లించాల్సి ఉంటుందని కార్మిక చట్ట నిపుణులు చెబుతున్నారు. ప్రత్యేకంగా ఐటీ, ఐటీఈఎస్, గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్స్ (GCCs), మార్కెటింగ్, డిజైన్ వంటి జ్ఞానాధారిత రంగాలకు ఈ విధానం ఎక్కువగా అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ రంగాల్లో ఇప్పటికే వర్క్ ఫ్రమ్ హోమ్, ఫ్లెక్సిబుల్ వర్క్ కల్చర్ బలంగా ఉండటంతో నాలుగు రోజుల పని విధానం అమలు సులభమవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.
అయితే ఆరోగ్య సంరక్షణ, ఆసుపత్రులు, రిటైల్, హోటల్స్, రవాణా, లాజిస్టిక్స్, తయారీ రంగాలకు ఈ విధానం అమలు చేయడం అంత సులభం కాదని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ రంగాల్లో నిరంతర సేవలు అవసరం కావడంతో, సిబ్బంది అందుబాటులో ఉండటం కీలకమని పేర్కొంటున్నారు. ఉద్యోగ–వ్యక్తిగత జీవిత సమతౌల్యాన్ని మెరుగుపరచడంలో ఈ విధానం కీలక మార్పు తీసుకురావచ్చని, అయితే అమలులో సంస్థల అవసరాలు, ఉద్యోగుల సామర్థ్యాలు కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి