
ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఇంధన మార్కెట్ల అస్థిరత కొనసాగుతున్నప్పటికీ, దక్షిణాసియాలో భారత్ ఆర్థిక వ్యవస్థ బలమైన స్తంభంగా నిలుస్తోందని తాజా నివేదికలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా ప్రపంచ బ్యాంక్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి అంచనాను 6.3 శాతం నుంచి 6.6 శాతానికి పెంచడం గమనార్హం. ఈ సవరించిన అంచనాలు మధ్యప్రాచ్య ప్రాంతంలో కొనసాగుతున్న సంఘర్షణలు, ప్రపంచ ఇంధన ధరల ఒడిదుడుకుల నేపథ్యంలో వచ్చాయి. ఈ ప్రభావంతో దక్షిణాసియా మొత్తం వృద్ధి రేటు 2025లో 7.0 శాతం నుంచి 2026 నాటికి 6.3 శాతానికి తగ్గుతుందని నివేదిక చెబుతోంది. అయితే ఈ అనిశ్చిత పరిస్థితుల్లో కూడా భారత్ ప్రధాన వృద్ధి చోదక శక్తిగా కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు.
భారత ఆర్థిక వ్యవస్థ 2025-26లో 7.6 శాతం వృద్ధిని నమోదు చేసి, 2026-27లో 6.6 శాతానికి స్వల్పంగా తగ్గినా, ఇది స్థిరమైన ప్రదర్శనగా పరిగణించబడుతోంది. బలమైన దేశీయ డిమాండ్, వినియోగం, పెట్టుబడులు ఈ వృద్ధికి కీలక కారకాలుగా నిలుస్తున్నాయి. ఈ సందర్భంగా అజయ్ బంగా ప్రపంచ ఆర్థిక పరిస్థితులపై హెచ్చరిక జారీ చేశారు. మధ్యప్రాచ్య సంక్షోభం ప్రభావం తగ్గకపోతే, ప్రపంచ వృద్ధి మందగించి, ద్రవ్యోల్బణం ఎక్కువ కాలం కొనసాగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల వర్ధమాన మార్కెట్లపై, ముఖ్యంగా ఇంధన దిగుమతులపై ఆధారపడే దేశాలపై ఒత్తిడి పెరుగుతుందని చెప్పారు.
దక్షిణాసియాలో ఇతర దేశాల పరిస్థితి మాత్రం మిశ్రమంగా ఉంది. బంగ్లాదేశ్ వృద్ధి 3.9 శాతానికి పరిమితమవుతుందని అంచనా వేయగా, భూటాన్ 7.1 శాతం వృద్ధిని సాధించే అవకాశం ఉంది. శ్రీలంక, మాల్దీవులు వంటి దేశాలు ఇంధన ధరల పెరుగుదలతో ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. మొత్తంగా చూస్తే ప్రపంచ అనిశ్చితులు కొనసాగుతున్నప్పటికీ, భారతదేశం స్థిరమైన వృద్ధి మార్గంలో కొనసాగుతూ, దక్షిణాసియా ఆర్థిక వ్యవస్థకు ప్రధాన లంగరుగా నిలుస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి