
వందే భారత్ స్లీపర్ రైలు సర్వీసుల కోసం ఎదురుచూస్తున్న రైల్వే ప్రయాణికులకు శుభవార్త. దేశంలో తొలి వందే భారత్ స్లీపర్ రైలు గత నెలలో ప్రారంభమవ్వగా.. మరిన్ని రైళ్లు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయోనని ప్రయాణికులు నిరిక్షిస్తున్నారు. ఈ క్రమంలో రైల్వేశాఖ నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది. వచ్చే నెల నాటికి రెండు వందే భారత్ స్లీపర్ రేక్లు సిద్దం కానున్నాయి. బెంగళూరుకు చెందిన ప్రభుత్వ రంగంసంస్థ అయిన భారత్ ఎర్త్ మూవర్స్ లిమిడెట్(BEML) మరో రెండు రైళ్ల తయారీని మార్చి నెల చివరి నాటికి పూర్తి చేయనుంది. అనంతరం రైల్వే శాఖ ట్రయల్ రన్స్ నిర్వహించి వీటిని ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానుంది. దీంతో త్వరలోనే రెండో వందే భారత్ స్లీపర్ రైలు కోసం ప్రారంభం కానున్నాయని చెప్పవచ్చు. ప్రస్తుతం హౌరా-గువహతి మధ్య తొలి వందే భారత్ స్లీపర్ రైలు సర్వీసులు అందిస్తోన్న విషయం తెలిసిందే.
చెన్నైలోని ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీతో కలిసి బీఈఎంఎల్ స్లీపర్ రైళ్లను అభివృద్ది చేస్తోంది. ముందుగా జరిగిన ఒప్పంద ప్రకరం మార్చి 31 నాటికి 16 కోచ్లతో కూడిన 10 స్లీపర్ రేక్లను తయారు చేసి రైల్వేశాఖకు డెలివరీ చేయాల్సి ఉంది. కానీ పనులు ఆలస్యం కావడం వల్ల మార్చి నెలాఖరు వరకు రెండు రైళ్లను అందించేందుకు సిద్దమవుతోంది. ఇక మిగతా రైళ్లను ప్రతీ నెల ఒక రైలు లెక్కన రైల్వేశాఖకు అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆగస్టు నాటికి 10 వందే భారత్ స్లీపర్ రైళ్లను రైల్వేశాఖకు అప్పగించేందుకు ప్రయత్నాలు జుగుతున్నాయి. బెంగళూరులోని కోచ్ ఫ్యాక్టరీ నుంచి డెలివరీ అయ్యాక ట్రయల్ రన్స్, టెస్టింగ్, ఆమోదాల ద్వారా అవి పట్టాలెక్కడానికి కొంత సమయం పడుతుంది. దీంతో రానున్న కొద్ది నెలల్లోనే రెండో వందే భారత్ స్లీపర్ రైలు ట్రాకులపై పరుగులు తీయనుందని చెప్పవచ్చు.
భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ బెంగళూరులో 260 వందే భారత్ రేక్లను తయారు చేయాలనే లక్ష్యం పెట్టుకుంది. విడతల వారీగా వీటిని రూపొందించనుంది. 260 వందే భారత్ స్లీపర్ రేక్ల తయారీకి అధికారులు ప్రణాళికలు రచించారు. చెన్నైలోని ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ మరో 50 రేక్లను స్వతంత్రంగా తయారు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ రేక్లలో ప్యాంట్రీ కార్లతో పాటు 24 కోచ్లు ఉంటాయి. వందే భారత్ స్లీపర్ రైలు తయారీ, సాంకేతికత, ప్రోటోటైప్ అభివృద్ధి, ట్రయల్స్, సిరీస్ ఉత్పత్తి వంటి వాటిని BEML, ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ సంయుక్తంగా చేపడుతున్నాయి.