
దేశవ్యాప్తంగా నలుమూలలకు రైల్వే నెట్ వర్క్ విస్తరించి ఉంది. అయితే కరువు పీడిత ప్రాంతాలు, జలవనరులు తక్కువగా ఉన్న రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు నీటి సౌకర్యం అందించడం రైల్వేశాఖకు పెద్ద సవాల్గా మారింది. కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాలు తక్కువగా ఉంటాయి. త్రాగునీటి లభ్యత లేకపోవడం వల్ల స్వచ్చమైన నీటిని అందించడం సమస్యగా మారింది. ఈ సమస్యను పరిష్కరించి ప్రయాణికులకు స్వచ్చమైన త్రాగునీటిని అందించేందుకు రైల్వేశాఖ కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. త్రాగునీటి లభ్యత లేని ప్రాంతాల్లో రైల్వేశాఖ వాతావరణ జల జనరేటర్లను ఏర్పాటు చేయనుంది. ఈ యంత్రాలు గాలిలో ఉండే తేమ నుంచి వచ్చే త్రాగునీటిని ఉత్పత్తి చేస్తుంది.
రైల్వే బోర్డు ఇటీవల లేఖను జారీ చేసింది. అన్ని రైల్వే జోన్లు, ఉత్పత్తి యూనిట్లు, ప్రభుత్వ కంపెనీల అధిపతులకు లేఖ రాసింది. నీటి కొరత ఉన్న ప్రదేశాల్లో ఎయిర్-వాటర్ డీయోనైజర్లను ఏర్పాటు చేయాలని రైల్వే బోర్డు సూచించింది. గత నెలలో ఈ లేఖ విడుదల చేయగా.. నిరంతర తాగునీటి సరఫరా అవసరమయ్యే రైల్వే స్టేషన్లు, ఆసుపత్రులు, ఉద్యోగుల కాలనీలు, కార్యాలయాలు, లెవెల్ క్రాసింగ్లు, ఇతర సేవా ప్రాంతాలను ఏర్పాటు చేయడానికి అనువైన ప్రదేశాలుగా పేర్కొంది.
ఈ వాతావరణ జనరేటర్లు గాలిలో ఉండే తేమ నుంచి త్రాగునీటిని ఉత్పత్తి చేస్తాయి. సాంప్రదాయ నీటి వనరులపై ఆధారపడటాన్ని ఇది తగ్గిస్తుంది. ప్రయాణికులకు నిరంతరం నీటిని అందించడంలో ఇది సహాయపడుతుంది. ఇది ఒక వినూత్నమైన, పర్యావరణ అనుకూలమైన పరిష్కార మార్గంగా చెప్పవచ్చు. కాగా 2019 డిసెంబర్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఈ జనరేటర్లను ఏర్పాటు చేశారు. దీని వల్ల మంచి ఫలితాలు వచ్చాయి. దీంతో ఆగస్టు 2022లో సెంట్రల్ రైల్వే ముంబై డివిజన్ ఆరు స్టేషన్లలో ఈ జనరేటర్లను ఏర్పాటు చేసింది. ఇప్పుడు మరిన్ని స్టేషన్లకు వీటిని విస్తరించే ప్రయత్నం చేస్తోంది.