
ప్రపంచ ప్రొఫెషనల్ సర్వీసెస్ సంస్థ Aon విడుదల చేసిన వార్షిక జీతం పెరుగుదల, టర్నోవర్ సర్వే 2025-26 ఇండియా ప్రకారం.. 2026లో ఇండియాలో అన్ని రంగాల్లో జీతాలు సగటున 9.1 శాతం పెరిగే అవకాశం ఉంది. ఇది 2025లో నమోదైన 8.9 శాతం పెరుగుదలతో పోలిస్తే స్వల్పంగా ఎక్కువ. సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది అంచనా వేసిన వేతన పెంపు దేశంలో జీతాల పెరుగుదల ధోరణి కొనసాగుతున్నదనే సంకేతం. దేశవ్యాప్తంగా 45 పరిశ్రమలకు చెందిన 1,400కు పైగా సంస్థల నుంచి సేకరించిన డేటాను విశ్లేషించి ఈ నివేదిక రూపొందించారు. పరిశ్రమల వారీగా జీతాల పెంపులో తేడాలు ఉంటాయని ఆయోన్ స్పష్టం చేసింది.
సర్వే ప్రకారం మొత్తం మీద ఉద్యోగులకు ఈ సంవత్సరం సగటున 9.5 శాతం వరకు ఇంక్రిమెంట్ లభించే అవకాశముంది. ఆయోన్ టాలెంట్ సొల్యూషన్స్ ఇండియా భాగస్వామి రూపాంక్ చౌదరి మాట్లాడుతూ.. భారత్ బలమైన ఆర్థిక పునాదిపై తదుపరి వృద్ధి దశలోకి అడుగుపెడుతోందన్నారు. భౌగోళిక రాజకీయ అనిశ్చితి ఉన్నప్పటికీ, దేశీయ డిమాండ్ స్థిరంగా ఉండటం, ద్రవ్యోల్బణం తగ్గడం, కొత్త వాణిజ్య ఒప్పందాలు మధ్యకాలంలో సానుకూల దృక్పథాన్ని అందిస్తున్నాయని పేర్కొన్నారు. ఉద్యోగ మార్పుల విషయంలో కూడా మెరుగుదల కనిపించింది. ఇండియాలో మొత్తం ఉద్యోగ విరమణలు 2023లో 18.7 శాతం, 2024లో 17.7 శాతం కాగా, 2025లో 16.2 శాతానికి తగ్గాయి.
ఇక కొత్త కార్మిక చట్టాల అమలుపై వ్యాఖ్యానిస్తూ ఆయోన్ అసోసియేట్ భాగస్వామి అమిత్ కుమార్ ఓట్వానీ మాట్లాడుతూ.. కొత్త లేబర్ కోడ్లు సంస్థలకు దశాబ్దాల్లోనే కీలక నియంత్రణ మార్పులను తెచ్చాయని చెప్పారు. వేతనాల ప్రమాణీకరణ, విస్తరించిన సామాజిక భద్రతా నిబంధనలు కారణంగా కంపెనీలు తమ పే స్ట్రక్చర్ను పునర్విమర్శిస్తున్నాయని ఆయన వివరించారు. ఉద్యోగుల్లో విశ్వాసం నిలుపుకోవడానికి ఈ మార్పులపై స్పష్టమైన కమ్యూనికేషన్ అత్యంత కీలకమని ఆయన సూచించారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి