రష్యా నుంచి LNG దిగుమతికి నో చెప్పిన భారత్‌! కారణం ఏంటంటే?

మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు, ఇంధన సరఫరా ఆందోళనల మధ్య ఆంక్షల పరిధిలో ఉన్న రష్యా LNG కొనుగోలు ప్రతిపాదనను భారత్ తిరస్కరించింది. ఇంధన భద్రతను కాపాడుకుంటూనే, అమెరికా ఆంక్షలను ఉల్లంఘించకుండా జాగ్రత్త పడుతోంది. దీంతో ఒక LNG ట్యాంకర్ అనిశ్చితిలో పడింది. ఆంక్షలు లేని రష్యా LNG కొనుగోలుకు సిద్ధంగా ఉన్నప్పటికీ, సరఫరాలు పరిమితంగా ఉన్నాయి.

రష్యా నుంచి LNG దిగుమతికి నో చెప్పిన భారత్‌! కారణం ఏంటంటే?
India Russia Lng

Updated on: May 12, 2026 | 11:53 AM

మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు, ఇంధన సరఫరాపై ఆందోళనల మధ్య అమెరికా ఆంక్షలకు గురైన రష్యా ద్రవీకృత సహజ వాయువు (LNG) కొనుగోలు ప్రతిపాదనను భారత్ తిరస్కరించినట్లు సమాచారం. ఈ విషయంపై అవగాహన ఉన్న వర్గాల ప్రకారం, ఆంక్షల పరిధిలో ఉన్న LNG కార్గోలను స్వీకరించడంపై భారత్ జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. దీంతో భారతదేశానికి రావాల్సిన ఒక LNG ట్యాంకర్ ప్రస్తుతం అనిశ్చితిలో పడినట్లు తెలుస్తోంది. ప్రపంచంలో మూడవ అతిపెద్ద చమురు దిగుమతిదారు అయిన భారత్, ఒకవైపు ఇంధన భద్రతను కాపాడుకోవాలని చూస్తూనే, మరోవైపు అమెరికా ఆంక్షలను ఉల్లంఘించే ప్రమాదాన్ని నివారించేందుకు ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా LNG సరఫరాలను దాచడం కష్టమవడం వల్ల భారత్ మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం.

వర్గాల ప్రకారం బాల్టిక్ సముద్రంలోని రష్యా పోర్టోవాయా LNG ప్లాంట్ నుంచి బయల్దేరిన కార్గోను భారత్ స్వీకరించలేదు. ఆ నౌక పశ్చిమ భారతదేశంలోని దహేజ్ LNG టెర్మినల్‌కు రావాల్సి ఉన్నప్పటికీ, ప్రస్తుతం సింగపూర్ సమీప జలాల్లో నిలిచిపోయినట్లు అంతర్జాతీయ షిప్పింగ్ డేటా సూచిస్తోంది. రష్యా సముద్ర మార్గ ముడి చమురుకు భారత్ ఇప్పటికీ అతిపెద్ద కొనుగోలుదారుల్లో ఒకటే అయినప్పటికీ, అమెరికా ఆంక్షల పరిధిలో ఉన్న LNG విషయంలో మాత్రం జాగ్రత్తగా ముందుకెళ్తోంది. ఈ అంశాన్ని ఏప్రిల్‌లో రష్యా ఉప ఇంధన శాఖ మంత్రి పావెల్ సొరోకిన్ భారత్ పర్యటన సందర్భంగా భారత అధికారులు స్పష్టంగా తెలియజేసినట్లు సమాచారం. ఆయన కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరితో కూడా సమావేశమైనట్లు తెలుస్తోంది.

ఉక్రెయిన్ యుద్ధం తరువాత అమెరికా రష్యా LNG ప్లాంట్లపై ఆంక్షలను మరింత కఠినతరం చేసింది. అయితే ఆంక్షలు లేని రష్యన్ LNG కొనుగోలుకు భారత్ సిద్ధంగానే ఉన్నప్పటికీ, అందులో ఎక్కువ భాగం ఇప్పటికే ఐరోపా మార్కెట్లకు కేటాయించబడిందని వర్గాలు పేర్కొన్నాయి. ఇదిలా ఉండగా ఇంధన వినియోగాన్ని తగ్గించాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు. అవసరమైతే ఇంటి నుంచే పని చేయడం, విదేశీ ప్రయాణాలను తగ్గించడం, ఇంధన పొదుపు చర్యలు పాటించడం ద్వారా దేశ ఇంధన భద్రతకు సహకరించాలని ఆయన సూచించారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us