
పెట్రోల్, డీజిల్ అమ్మకాల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై విధించిన ఆంక్షలను జూలై ఒకటి నుంచి ఎత్తివేస్తున్నట్టు పేర్కొంది. అమెరికా- ఇరాన్ మధ్య శాంతి ఒప్పందంతో హర్మూజ్ జలసంది తెరుచుకొని చమురు సరఫరా పునః ప్రారంభం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్లు, పారిశ్రామిక వినియోగదారులు వంటి కమర్షియల్ కస్టమర్లు లబ్ధి చేకూరనుంది. వారు ఇకపై ఎలాంటి పరిమితులు లేకుండా రిటైల్ అవుట్లెట్ల నుండి నేరుగా ఇంధనాన్ని కొనుగోలు చేయవచ్చు.
గతంలో ఆంక్షలు ఎందుకు విధించింది
జూన్ నెలలో ఈ ఆంక్షలను తీసుకురావడానికి ప్రధాన కారణం రిటైల్ ధరలకు, బల్క్ సరఫరా ధరలకు మధ్య ఉన్న భారీ వ్యత్యాసమే. పారిశ్రామిక వినియోగదారులకు విక్రయించే బల్క్ డీజిల్ ధర, రిటైల్ ధర కంటే లీటరుకు దాదాపు రూ. 40 ఎక్కువగా ఉండటంతో, రవాణా సంస్థలు, పరిశ్రమలు రిటైల్ బంకుల వైపు మొగ్గు చూపాయి. దీనివల్ల రిటైల్ బంకుల్లో ఇంధనానికి విపరీతమైన డిమాండ్ పెరిగి, కొరత ఏర్పడే పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలోనే ఇంధనం పక్కదారి పట్టకుండా చూసేందుకు, నిల్వలను అరికట్టేందుకు, అందరికీ సమానంగా, సరసమైన ధరలకే ఇంధనం అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం అప్పట్లో ఈ తాత్కాలిక ఆంక్షలను విధించింది.
శుద్ధి చేసిన పెట్రోలియం ఉత్పత్తుల నికర ఎగుమతిదారుగా ఉన్న భారతదేశం, అంతర్జాతీయ మార్కెట్ ఒడిదుడుకుల నుండి దేశీయ అవసరాలను కాపాడటానికి ఈ తాత్కాలిక ఆంక్షలను విధించింది. ప్రస్తుతం దేశంలో ఇంధన సరఫరా సాధారణ స్థితికి చేరుకుందని ప్రభుత్వం భావించడంతోనే ఈ ఆంక్షలను పూర్తిగా ఎత్తివేసింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.