కొత్త చట్టం.. ఇక వాటిపై కూడా పన్ను! ఏప్రిల్‌ 1 నుంచి జరిగే మార్పులు ఇవే..

ఏప్రిల్ 1, 2025 నుండి అమల్లోకి వచ్చే కొత్త ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ యాక్ట్‌ 2025లోని కీలక 1 శాతం నిబంధన పన్ను రహిత ఆదాయంపై గణనీయ ప్రభావం చూపుతుంది. పన్ను రహిత ఆదాయాన్ని సంపాదించే ఖర్చులను ఇకపై పూర్తిగా మినహాయించరు. ఫలితంగా, పన్ను చెల్లించాల్సిన ఆదాయం పెరిగి, అధిక పన్నులు చెల్లించాల్సి రావచ్చు.

కొత్త చట్టం.. ఇక వాటిపై కూడా పన్ను! ఏప్రిల్‌ 1 నుంచి జరిగే మార్పులు ఇవే..
Income Tax Act 2025

Updated on: Mar 26, 2026 | 8:55 PM

దేశంలో పన్ను వ్యవస్థలో కీలక మార్పులకు నాంది పలుకుతూ ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ యాక్ట్‌ 1961 స్థానంలో కొత్త చట్టం ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ యాక్ట్‌ 2025, ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. ఈ కొత్త చట్టంలో ముఖ్యంగా పెట్టుబడిదారులపై ప్రభావం చూపే ఒక కీలక నిబంధనగా 1 శాతం రూల్ నిలుస్తోంది. ఇది పన్ను రహిత ఆదాయాన్ని కూడా పరోక్షంగా పన్ను లెక్కల్లోకి తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రూల్స్‌ 2026లోని కొత్త నియమం 14 ప్రకారం పన్ను రహిత ఆదాయానికి సంబంధించిన ఖర్చులను ఇకపై పూర్తిగా మినహాయింపుగా పరిగణించరు. ఈ నియమం ప్రకారం పన్ను రహిత ఆదాయాన్ని సంపాదించడానికి జరిగిన ప్రత్యక్ష ఖర్చులతో పాటు, ఆ ఆదాయం తీసుకువచ్చే పెట్టుబడుల సగటు విలువలో 1 శాతాన్ని కూడా ఖర్చుగా పరిగణిస్తారు. అయితే మొత్తం ఖర్చు మీరు ప్రకటించిన మొత్తాన్ని మించకూడదు.

సాధారణంగా చెప్పాలంటే డివిడెండ్‌లు లేదా ఇతర పన్ను రహిత ఆదాయం పొందినప్పుడు, ఆ ఆదాయంపై పన్ను లేకపోయినా, దానికి సంబంధించిన ఖర్చులను తగ్గించుకునే అవకాశం తగ్గుతుంది. ఫలితంగా మీ పన్ను చెల్లించాల్సిన మొత్తం ఆదాయం పెరిగి, చివరికి ఎక్కువ పన్ను చెల్లించాల్సి రావచ్చు. ఈ నియమం ప్రతి ఒక్కరికి స్వయంచాలకంగా వర్తించదు. మీరు ఆ పన్ను రహిత ఆదాయానికి సంబంధించిన ఖర్చులను క్లెయిమ్ చేసినప్పుడు లేదా పన్నుల శాఖ అటువంటి ఖర్చులు జరిగినట్లు భావించినప్పుడు మాత్రమే ఇది అమల్లోకి వస్తుంది. మీరు ఎలాంటి ఖర్చులు చేయలేదని నిరూపించగలిగితే, ఈ నిబంధన ప్రభావం తగ్గే అవకాశం ఉంటుంది.

ప్రత్యేకంగా డివిడెండ్ ఆదాయం పొందేవారు, పెద్ద పెట్టుబడి పోర్ట్‌ఫోలియో ఉన్నవారు, అలాగే ఆర్థిక ఖర్చులను క్లెయిమ్ చేసేవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. పన్ను నిపుణులు సూచిస్తున్నదేమిటంటే, పెట్టుబడులు, ఖర్చులపై స్పష్టమైన రికార్డులు ఉంచుకోవడం ఇప్పుడు అత్యంత అవసరం. మొత్తంగా కొత్త పన్ను విధానం సరళతకే పరిమితం కాకుండా పారదర్శకతను కూడా పెంచడమే లక్ష్యంగా కనిపిస్తోంది. ఇకపై పన్ను రహిత ఆదాయం పూర్తిగా ప్రభావం లేకుండా ఉండదనే సంకేతాన్ని ఈ 1 శాతం నియమం ఇస్తోంది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us