ప్రస్తుత ఆధునిక యుగంలో రోజూ వారీ ఖర్చులు బాగా పెరిగాయి. ఇక ఇల్లు కట్టుకోవడం, కార్లు వంటివి కొనుగోలు చేయడం, పిల్లల ఉన్నత చదువుల కోసం ముందస్తు ప్రణాళిక చేసుకోవడం కష్టతరమవుతోంది. నెలవారీ జీతంలో నుంచి అనవసర ఖర్చులు తగ్గించుకొని, ఎంతో కొంత పొదుపు చేయావలసిన అనివార్యత కనిపిస్తోంది. మరోవైపు ఆర్థిక మాంద్యం భయాలతో ఉద్యోగ భద్రత కొరవడిన నేపథ్యంలో అందరూ ఆర్థిక క్రమశిక్షణ పాటించడంతో పాటు బెస్ట్ పొదుపు పథకాల కోసం అన్వేషణ చేస్తున్నారు. సురక్షిత పెట్టుబడి పథకాలైన పీపీఎఫ్, ఎఫ్డీ వంటి వాటితో పాటు మార్కెట్ ఒడిదొడుకులకు లోనయ్యే మ్యూచువల్ ఫండ్స్పై కూడా చాలా మంది పెట్టుబడులు పెట్టేందుకు వెనుకాడటం లేదు. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కాస్త రిస్క్ అయినా ఆలోచించడం లేదు. అయితే ఇలా పెట్టుబడి పెట్టాలనుకునే వారు ఆయా పథకాలపై కాస్త స్టడీ చేయడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు. నెలవారీ సంపాదనలోనుంచి ఏయే పథకాల్లో పెట్టుబడి పెడితే మంచి రాబడులు రాబట్టవచ్చో ఓ సారి చూద్దాం..
ఉదాహరణకు మీరు నెలకు రూ. 70,000 సంపాదిస్తున్నారనుకోండి.. భవిష్యత్తులో మీ పిల్లల ఉన్నత చదువులకు భారీ మొత్తంలో నగదు అవసరం. మీకు అందుబాటులో ఉన్న టైం స్పాన్ కేవలం పదేళ్లు అనుకుందాం. ఈ పదేళ్లలో మీకు దాదాపు రూ. 50 లక్షలు కావాలి అనుకున్నప్పుడు ఏయే పథకాల్లో పెట్టుబడులు పెట్టాలో ఓ సారి చూద్దాం.. మీ నెలవారీ జీతం నుంచి రూ. 3000ల చొప్పున సిస్టామేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్(ఎస్ఐపీ) అయిన ఎస్బీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ గ్రోత్, పరాగ్ పెరిక్ ఫ్లెక్సీ కాప్ ఫండ్, కోటాక్ ఈక్విటీ ఆపర్చు్యనిటీ ఫండ్, ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్ వంటి వాటిల్లో పెట్టుబడులు పెట్టవచ్చు. అలాగే మరో రూ. 3000లను పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్)లో, ప్రతి నెల రూ. 100 రికరింగ్ డిపాజిట్ చేస్తే బాగుంటుంది. ఇవి కాక స్టాక్ మార్కెట్లోనూ మీరు పెట్టుబడులు పెట్టుకోవచ్చు. వీటిలో నెలకు మరో రూ. 15,000 పెట్టుబడులు పెట్టారనుకోండి. అంటే మీ నెల జీతం నుంచి దాదాపు రూ. 30వేల వరకూ వివిధ పథకాల్లో పెట్టుబడులు పెట్టారనుకుంటే మీరు అనుకున్న లక్ష్యం చేరుకునే అవకాశం ఉంటుంది. అలాగే మీ సంవత్సర ఆదాయం నుంచి రూ. 3 లక్షలను ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోకలిగితే మరింత ప్రయోజనం ఉంటుంది.
పదేళ్లలో మీరు అనుకున్న లక్ష్యం సంపాదన సాధించాలి అనుకున్నప్పుడు మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్ వంటి వాటిల్లో పెట్టుబడులు పెట్టడంతో పాటు లైఫ్ ఇన్స్యూరెన్స్ పాలసీ కూడా కలిగి ఉండటం ముఖ్యం. దీనిలో డెత్ కవర్ కూడా ఉండేటట్లు చూసుకోవాలి. అలాగే ఎస్ఐపీల్లో పెట్టుబడులను నిర్ణీత సమయం వరకూ ఉంచకుండా.. కాలవ్యవధికి మూడేళ్ల ముందే విత్ డ్రా చేసుకొని సురక్షిత పొదుపు పథకాలలో ఇన్వెస్ట్ చేయడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు.
నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆర్థికవేత్తల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే ఆర్థిక నిపుణులను సంప్రదించండి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..