
దేశంలో వైద్య ఖర్చులు భారీగా పెరుగుతున్నాయి. మెడిసిన్స్, ఇతర వైద్య ఔషధ ఉత్పత్తుల ధరలు సామాన్యులకు అందనంత ఎత్తుకి చేరుకుంటున్నాయి. ఇక బ్రాండెడ్ మెడిసిన్స్ ధరలు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీటి ధరలు ఎక్కువగా ఉండటంతో సామాన్యులు కొనులేని పరిస్థితి నెలకొంది. వీటికి ప్రత్యామ్నాయంగా సామాన్య ప్రజలకు తక్కువ ధరకే మెడిసిన్స్ అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం జనరిక్ మందులను అందిస్తోంది.
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా జన ఔషధి కేంద్రాలను అన్ని నగరాలు, పట్టణాల్లో ప్రవేశపెట్టింది. ఈ కేంద్రాల ద్వారా ప్రజలకు అతి తక్కువ ధరకే మెడిసిన్స్ అందిస్తోంది. అంతేకాకుండా ఇక్కడ అనేక ఆఫర్లు కూడా ప్రవేశపెడుతున్నారు. బయటి షాపులతో పోలిస్తే ఈ జన ఔషదీ కేంద్రాల్లో అతి తక్కువ ధరకు మందులు కొనుగోలు చేసే అవకాశం లభించింది. దేశవ్యాప్తంగా వీటికి ప్రజల నుంచి ఆదరణ పెరుగుతున్న క్రమంలో కేంద్రం జన ఔషధీ సుగమ్ యాప్ను లాంచ్ చేసింది. ఈ యాప్ ద్వారా జన ఔషధీ కేంద్రం మీ సమీపంలో ఎక్కడ ఉందో సులువుగా గుర్తించవచ్చు. ఈ కేంద్రాలు ఎక్కడ ఉంటాయో తెలియక ప్రజలు అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోతున్నారు. దీంతో మొబైల్ అప్లికేషన్స్ ద్వారా ఈ షాపులు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించి అక్కడికి వెళ్లి మెడిసిన్స్ కొనుగోలు చేయొచ్చు.
-గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్లండి
-జన ఔషధి సుగమ్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి
-యాప్ను డౌన్లోడ్ చేసుకోండి
-మీ వివరాలు ఇచ్చి లాగిన్ అవ్వండి
-మీ లొకేషన్ యాక్సెస్ ఇవ్వండి
-సమీప స్టోర్ను గుర్తించండి అనే ఆప్షన్ను ఎంచుకోండి
-మీ సమీపంలోని జన ఔషధి స్టోర్స్ మీకు యాప్లో కనిపిస్తాయి
-షాపుల అడ్రస్, గూగుల్ మ్యాప్ లొకేషన్ కనిపిస్తుంది
-గూగుల్ మ్యాప్ ఆధారంగా మీరు అక్కడికి వెళ్లి జనరిక్ మందులను తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు
ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి ప్రయోజన పథకం కింద ఈ జన ఔషధి కేంద్రాలను ప్రభుత్వం ప్రారంభించింది. బ్రాండెడ్ మందుల కంటే 50 నుంచి 80 శాతం తక్కువతో ఇక్కడ నాణ్యమైన మెడిసిన్స్ దొరుకుతాయి. 2018లో వీటిని భారత ప్రభుత్వం వీటిని ప్రారంభించగా.. ప్రస్తుతం దేశంలో 16 వేలకుపైగా జన ఔషధి కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం 2047 మందులను వీటిల్లో విక్రయిస్తున్నారు. అలాగే శస్త్రచికిత్సకు అవసరమయ్యే 300 వస్తువులను కూడా విక్రయిస్తున్నారు. ఆగస్టు 2019లో జన ఔషధి యాప్ను తీసుకొచ్చారు. ఈ యాప్లో దుకాణాల సమాచారాన్ని తెలుసుకోవచ్చు.